బస్సు ప్రమాదం: దివాకర్ ట్రావెల్స్ మీద రిజిస్ట్రేషన్
హైదరాబాద్: ప్రమాదానికి గురైన వోల్వో బస్సు రిజిస్ట్రేషన్ దివాకర్ ట్రావెల్స్ పేరు మీదే ఉంది. జబ్బార్ ట్రావెల్స్ ఆ బస్సును నడుపుతోంది. దివాకర్ ట్రావెల్స్కు మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి అధినేతగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఆ బస్సుతో తమకు ఏ విధమైన సబంధం లేదని, రెండేళ్ల క్రితమే దాన్ని అమ్మేశామని జెసి ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. టైటిల్ మార్చకపోవడంతో తమ పేరు మీదనే బస్సు ఉందని ఆయన చెప్పారు. జబ్బార్ ట్రావెల్స్తో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు.
కాగా, బస్సు డ్రైవర్ను, క్లీనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందు టైర్ పేలి బస్సు అదుపు తప్పిందని, నియంత్రించే క్రమంలో బస్సు కల్వర్టును ఢీకొట్టిందని, మంటలు అంటుకోవడంతో మరింత అదుపు తప్పిందని డ్రైవర్ అంటున్నారు. మంటలు అంటుకోవడంతో తానూ క్లీనర్ కిందికి దూకేసినట్లు అతను చెప్పాడు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతంగా కాలిపోయాయని, డిఎన్ఎ పరీక్ష చేసి గుర్తించాల్సి ఉందని డిఐజి చెప్పారు.
కాగా, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు 33 మంది ఉన్నట్లు డిఐజి తెలిపారు. మృతదేహాలు మాంసపు ముద్దల్లా మారిపోయాయి. ఘటనాస్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఆధారాలను బట్టి ఎంత మంది చనిపోయారనే విషయాన్ని సేకరిస్తున్నామని, ఇతర వివరాలు కూడా సేకరిస్తున్నామని చెప్పారు.