జగన్ పార్టీ నుండి 'కీ'లక నేతలు: ఎక్కడి నుండి ఎవరు?
హైదరాబాద్: రానున్న లోకసభ ఎన్నికల బరిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి ఎక్కువ మంది వ్యాపారవేత్తలు, బ్యూరోక్రేట్లు బరిలోకి దిగనున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో 25 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థులపై స్పష్టత ఇచ్చిన పార్టీ అధిష్టానం, మిగతా వారిని కూడా దాదాపు ఖాయం చేసింది. ఎన్నికల బరిలో పలువురు మాజీ ఐఏఎస్, ఐపిఎస్లు లేదా వారి భార్యలు బరిలోకి దిగనున్నారు.
మాజీ అధికారి వి వరప్రసాద రావు తిరుపతి లోకసభకు జగన్ పార్టీ టిక్కెట్ పైన పోటీ చేయనున్నారు. ఆయన 1983 తమిళనాడు బ్యాచ్కు చెందిన అధికారి. అతను 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. ఇప్పుడు జగన్ పార్టీ నుండి తిరుపతి నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. హై ప్రొఫైల్ గుజరాత్ ఐఏఎస్ అధికారి కిషోర్ రావు, మరో సివిల్ అధికారి సౌభాగ్య రావులు బాపట్ల నుండి టిక్కెట్ ఆశిస్తున్నారట.
కిషోర్ రావు గుజరాత్ మానవ హక్కుల కమిషన్లో పని చేస్తున్నారు. ఆయన ఇప్పటికే తన రాజీనామాను సమర్పించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఆయన గుజరాత్లో పలు ఉన్నత పదవులలో పని చేశారు. తనకు లేదా తన భార్య స్వర్ణకు బాపట్ల టిక్కెట్ ఇవ్వాలని ఆయన జగన్ను కోరుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

1987 బ్యాచ్కు చెందిన తోట చంద్రశేఖర్ మహారాష్ట్ర క్యాడర్కు చెందిన మాజీ అధికారి. 2008లో అతను వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకొని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. గుంటూరు నుండి పిఆర్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. కొత్తపల్లి గీత అరకు నుండి పోటీ చేయనున్నారట. ఈమె మాజీ అధికారి, వ్యాపారవేత్త కూడా. కోనేరు ప్రసాద్ విజయవాడ నుండి, అయోధ్య రామిరెడ్డి నరసారావు పేట నుండి బరిలోకి దిగనున్నారు.
చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సురేష్ రెడ్డి ఒంగోలు నుండి, మరో స్కూల్ అధినేత్రి రేణుక కర్నూలు నుండి, చలమశెట్టి సునీల్ కాకినాడ నుండి పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. సునీల్ 2009లో కాకినాడ నుండి పిఆర్పీ తరఫున పోటీ చేశారు. జగన్ పార్టీలో పలువురు కుటుంబ సభ్యులు కూడా బరిలోకి దిగుతున్నారు. జగన్ సోదరుడు అయిన అవినాశ్ రెడ్డి కడప నుండి పోటీ చేయనున్నారు.
లోకసభ బరిలో ఎవరెవరు ఎక్కడి నుండి?
వి వర ప్రసాద్ - తిరుపతి
వైయస్ అవినాష్ రెడ్డి - కడప
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి - రాజంపేట
అనంతపురం - అనంత వెంకట్రామి రెడ్డి
ఖమ్మం - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
విశ్వరూప్ - అమలాపురం
తోట చంద్రశేఖర్ - ఏలూరు
కోనేరు ప్రసాద్ - విజయవాడ
గుడివాడ అమర్నాథ్ - అనకాపల్లి
బేబీ నయన - విజయనగరం
సునీల్ - కాకినాడ
అయోధ్య రామిరెడ్డి - నర్సారావు పేట
ఎస్పీవై రెడ్డి - నంద్యాల
మేకపాటి రాజమోహన్ రెడ్డి - నెల్లూరు
పోటీకి అవకాశం
కొత్తపల్లి గీత - అరకు
రెడ్డి శాంతి - శ్రీకాకుళం
ప్రసాద రాజు - నరసాపురం
విద్యాసాగర్ - మచిలీపట్నం
బాలశౌరి - గుంటూరు
స్వర్ణ లేదా కిషోర్ రావు లేదా సౌభాగ్య రావు - బాపట్ల
రేణుక - కర్నూలు












Click it and Unblock the Notifications