బాబు అంగీకరిస్తే... టీడీపీలోకి బైరెడ్డి రీఎంట్రీ
హైదరాబాద్: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డిస తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. గురువారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు చర్చిస్తామని, ఆయన అంగీకరిస్తే మళ్లీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
రాయలసీమ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. రాయలసీమను అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్రమోడీని, చంద్రబాబును కోరతానని చెప్పారు. తనపై కొంతమంది కుట్ర చేసి హత్యాకేసులో ఇరికించారని బైరెడ్డి చెప్పారు.
రాయలసీమకు మేలు జరిగే విధంగా, అవసరమైతే మరొక్కసారి రాయలసీమ ప్రజల కోసం.. నిస్వార్థంగా టీడీపీ జెండా మోయడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. కాగా, బైరెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొవద్దంటూ ఆయన ప్రత్యర్ధులైన శివానందరెడ్డి, లబ్బి వెంకటస్వామి అధిష్టానికి లేఖ రాశారు. కర్నూలులో కేఈ సోదరులు, బైరెడ్డికి మధ్య గత కొంతకాలంగా విభేధాలున్నాయి.

బైరెడ్డి రాజశేఖర రెడ్డి గతంలోనే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాడంటూ అతను ఆ పార్టీ నుండి బయటకు వెళ్లిపోయారు. అప్పటికే ఆయన రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్నారు. దాని కోసం రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితిని స్థాపించారు.
అనంతరం రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో పార్టీని పెట్టారు. రాయలసీమ పరిరక్షణ సమితి పేరు మీద ఆయన పార్టీ కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే, ఎక్కడ కూడా ఆయన పార్టీ గెలవలేదు. దీంతో మళ్లీ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వార్తులు ఊపందుకున్నాయి.
కాగా, బైరెడ్డి సాయి ఈశ్వరుడు హత్య కేసులో హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. హత్య కేసులో అతను 2014 మార్చి నెలలో అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పార్టీ బాధ్యతలను ఆయన కూతురు తీసుకున్నారు. ఆమె సారథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేశారు. అనంతరం ఎన్నికల అనంతరం సెప్టెంబరు నెలలో ఆయన హత్య కేసులో కోర్టు ఎదుట లొంగిపోయారు. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ లభించింది.












Click it and Unblock the Notifications