బెజవాడకు బెదిరింపు, సీమకి పరిశ్రమ.. బాబు పొరపాటు!: బైరెడ్డి ఫైర్
కర్నూలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని, సీమకు రాజధాని రాకుండా చేశారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ చైతన్య యాత్రలో భాగంగా ఆయన రోడ్డు షో నిర్వహిస్తున్నారు.
ఆయన పలుచోట్ల చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. కర్నూలు జిల్లాకు రావాల్సిన రాజధానిని అమరావతికి తరలించి ముఖ్యమంత్రి చంద్రబాబు సీమకు తీరని అన్యాయం చేశారన్నారు. ఆదోని ఆంధ్రా ముంబైగా పేరుగాంచిందని, నేడు పాలకుల నిర్లక్ష్యానికి అధి అధోగతి పాలైందన్నారు.
Also Read: సీమకు వెళ్లిపోతారు: బెజవాడకి బాబు హెచ్చరిక, ఏకైక సీఎంగా రికార్డ్!
మూతపడ్డ పరిశ్రమలను తెరిపించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు అండగా నిలవాలన్నారు. సీమ జిల్లాలకు పరిశ్రమలు రాకుండా చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
అమరావతిలో ఇంటి అద్దెలు అధికంగా ఉన్నాయని, అద్దెలు తగ్గించకుంటే పరిశ్రమలు రాయలసీమకు తరలిపోతాయని పరోక్షంగా సీమ పైన తన అక్కసును వెళ్లగక్కారన్నారు. 123 అసెంబ్లీ స్థానాలు ఉన్న కోస్తాంధ్రపై ప్రేమతో పరిశ్రమలు, నిధులు అమరావతికి దోచిపెట్టి అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఖనిజ సంపదకు సీమ నిలయమని, కడపలో ప్రపంచంలోనే ఖరీదైన ఫుల్లేరన్ ఉందని, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పడితే ఈ ఖనిజం ఒక్కటే చాలన్నారు.
కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలు సస్యశ్యామలమై కరువు శాశ్వతంగా నివారించాలంటే 1850 నాటి బ్రిటీష్ ఇంజనీర్ మెకంజీ కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదులపై మూడు ప్రాజెక్టులు కట్టాలన్న స్కీంలు అమలు చేయాలన్నారు. ఎమ్మెల్యేలు అమ్ముడుబోతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు.
నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటైన ఉక్కు కర్మాగార ఫలాలు కోస్తాంధ్ర వారు అనుభవిస్తున్నారని, సీమకు సంబంధించటి కడప జిల్లాలో తలపెట్టిన బ్రాహ్మణీ స్టీలుపై నాడు రాజకీయాలు చేసి, మన ప్రాంతం వారికి వచ్చే ఉద్యోగాలు గండికొట్టారన్నారు.
కాగా, రెండు రోజుల క్రితం చంద్రబాబు మాట్లాడుతూ... బెజవాడలో అద్దెలు, భూముల ధరలు ఎక్కువగా పెరిగితే పరిశ్రమలు రాయలసీమకు వెళ్తాయని, అక్కడ అదే రకంగా ఉంటే పక్క రాష్ట్రాలకు వెళ్తాయన్నారు. బెజవాడలో అద్దెలు పెరిగితే రాయలసీమకు పరిశ్రమలు వెళ్తాయన్న వ్యాఖ్యలపై బైరెడ్డి ఆగ్రహించారు.
కడపలో ఏడుగురు కార్పోరేటర్లు టిడిపిలోకి..
కడప జిల్లా కార్పోరేషన్ పాలకవర్గంలో అలజడి చెలరేగింది. డిప్యూటీ మేయర్ అరీఫుల్లాతో పాటు ఏడుగురు వైసిపి కార్పోరేటర్లు టిడిపిలోకి వెళ్లాలని ఆదివారం నిర్ణయించారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వైసిపి ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబులు.. వారిని బుజ్జగిస్తున్నారు.