బాబు కెసిఆర్ని పిలవడంలోని ఆంతర్యమేమిటి?: జగన్కు కాంగ్రెస్ నేత మద్దతు
గుంటూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య ఆదివారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన దుమ్మెత్తి పోశారు. రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కెసిఆర్ను పిలవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
ఓ వైపు రాష్ట్రంలో, రాయలసీమ జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి శంకుస్థాపన అవసరమా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఇది అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కుటుంబానికి బద్ధ రాజకీయ శత్రువుగా పేరుపడ్డ కడప జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత సి రామచంద్రయ్య... జగన్ దీక్షకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో జగన్ చేస్తున్న దీక్షను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుపై మండిపడుతూ.. హంద్రీనీవా ప్రాజెక్టుకు చెందిన మోటారును పట్టిసీమకు తరలించి ప్రభుత్వం రాయలసీమకు తీరని అన్యాయం చేసిందన్నారు.
కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో గద్దెనెక్కిన చంద్రబాబు అధికార దర్పంతో విర్రవీగుతున్నారన్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చే లోగానే ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
ఎక్కువ ప్రయోజనాలివ్వాలి: కావూరి
ఏపీకి ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివ రావు అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. హోదా కంటే ఎక్కువ మేలు చేస్తామంటే కూడా అభ్యంతరం లేదన్నారు.హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పించగలిగితే అదే ఇవ్వాలని చెప్పారు. లేని పక్షంలో ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.