అమరావతి: ఈ నేతలంతా తంతే గారెల బుట్టలో పడ్డారా!?
అమరావతి: రాజధాని విస్తరణ ప్రతిపాదన నేపథ్యంలో.. దాని వల్ల కొందరు రాజకీయ నాయకులకే ఎక్కువ లాభం చేకూరుతుందనే వాదనలు వినిపిస్తున్నాయు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలకు ఎక్కువ లబ్ధి చేకూరవచ్చునని వార్తలు వస్తున్నాయి.
కంచికచర్ల, తాడికొండ, అమరావతి మండలాలలోని పలు గ్రామాలు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సొంత గ్రామాలు. రాజధాని విస్తరణ ప్రతిపాదనతో వారికి లేదా వారి కుటుంబ సభ్యులు, బంధువులకు కాస్త ఎక్కువ లబ్ధి చేకూరుతుందని అంటున్నారు.
పలువురు బిజెపి, తెలుగుదేశం, ఇతర పార్టీల నాయకులకు లాభమేనంటున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో రాజధాని పరిధి పెంచే ప్రతిపాదన ఉంది. పలు గ్రామాలు అమరావతి కిందకు రానున్నాయి.
కొత్త ప్రతిపాదన వల్ల వైకుంఠాపురం, పెదమద్దూరు, కార్లపూడి, లేమల్లే, ఎండాద్రి, తాడిగొండ, పెదపరిమి, నారుకుళ్లపాడు, ఎంకెపాడు, అమరావతి, ధరణికోట, ముత్తాయపాలెం, లింగాపురం తదితరాలు రాజధాని పరిధిలోకి రానున్నాయి.
ఇందులోని పలు గ్రామాలు.. రాజకీయ నాయకులకు చెందినవి ఉన్నాయి. కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి నేటివ్ ప్లేస్ కంచికచెర్ల సమీపంలోని పొన్నవరం. మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కంచికచర్లలో సెటిల్ అయ్యారు.
ఇలా పలువురు రాజకీయ నాయకులకు చెందిన స్థలాలు రాజధాని విస్తరణ ప్రతిపాదన ప్రాంతాల్లో ఉన్నాయని తెలుస్తోంది. రాయపాటి సాంబశివరావు నేటివ్ విలేజ్ ఉంగుటూరు. ఇది లేమల్లే గ్రామానికి సమీపంలో ఉంటుంది. వారి తాతముత్తాత ఆస్తులు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
పలువురు ఎమ్మెల్యేలకు కూడా స్థలాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మంత్రి పత్తిపాటి పుల్లారావు బంధువులకు, బిజెపి ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన ఆస్తులు సమీపంలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. బిజెపి ముఖ్య నేత కూతురు, ఎంపీ అయిన నటుడికి కూడా అక్కడ స్థలాలు ఉన్నాయని అంటున్నారు.