రాజధానిలో 20వ రోజు ఆందోళనలు .. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రాంమోహన్ 24 గంటల నిరాహారదీక్ష
ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానుల ప్రకటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో 20వ రోజుకు చేరాయి. రాజధాని రైతుల పోరాటం ఇప్పటికీ ఉధృతంగా సాగుతుంది. రాజధాని రైతులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తున్నా రాజధాని రైతుల పోరాటం మాత్రం ఆగటం లేదు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 29 రాజధాని గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు రాజధాని గ్రామాల ప్రజలకు పలు జిల్లాల నుండి మద్దతు కూడా తెలుపుతూ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

రాజధాని రైతుల పాదయాత్ర .. అనుమతించని పోలీసులు
ఇక ఈ నేపధ్యంలో నేడు మహాధర్నాలో రాజధాని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తుళ్లూరు నుంచి రాయపూడి మీదుగా మందడం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు . అయితే పోలీసులు మాత్రం రాజధాని రైతుల ఆందోళనలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. రైతుల పాదయాత్రకు పోలీసులు అనుమతి లేదని చెప్పారు. పాదయాత్ర నిర్వహిస్తే ఊరుకోబోమని తేల్చి చెప్పారు పోలీసులు.

ర్యాలీ నిర్వహిస్తామంటున్న రైతులు .. ప్రభుత్వ తీరుపై ఫైర్
దీంతో రాజధాని ప్రాంత రైతులు మాత్రం పోలీసులు అనుమతి నిరాకరించినా సరే ర్యాలీని జరిపితీరుతామని, ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. టెంట్ వేసుకునేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారని, రహదారిపైనే బైఠాయించి ఆందోళన తెలుపుతామని వారు పేర్కొన్నారు. రాజధాని అమరావతి తరలిస్తే ఆత్మహత్యలకు కూడా వెనుకాడబోమని తేల్చిచెప్పారు . రాజధాని తరలింపు, పరిహార ఖర్చులు కలిపి సుమారు రూ.75వేల కోట్లు అవుతాయని, ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఎక్కడనుంచి తెస్తుందో చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు.

రైతుల పోరాటానికి మద్దతు .. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 24గంటల నిరాహార దీక్ష
ఇక రాజధాని అమరావతి కోసం రైతులకు మద్దతుగా టీడీపీ నేతల ఆందోళనలు సైతం కొనసాగుతున్నాయి. ఇటీవల దేవినేని ఉమా రైతుల పోరాటానికి మద్దతుగా రాజధానిగా అమరావతి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 24 గంటల దీక్ష చేసిన విషయం తెలిసిందే . ఇక నేడు ‘సేవ్ ఏపీ..సేవ్ అమరావతి' పేరుతో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రాంమోహన్ నల్ల చొక్కా ధరించి 24 గంటల రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు.

రామ్మోహన్ దీక్షకు రాజధాని గ్రామాల రైతుల , ప్రజాసంఘాల మద్దతు
సోమవారం ఉదయం 11 గంటలకు బెంజ్ సర్కిల్ వేదిక ప్రాంగణంలో దీక్ష ప్రారంభించిన గద్దె రామ్మోహన్ మంగళవారం ఉదయం11 గంటల వరకు ఈ దీక్ష కొనసాగిస్తారు. గద్దె రాంమోహన్ దీక్షకు అమరావతి పరిరక్షణ సమతి, పలు ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఇక టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో అఖిల పక్ష భేటీలు నిర్వహిస్తూ రాజధాని అమరావతికి అనుకూలంగా తీర్మానాలు చేయిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications