రాజధాని రగడ వద్దు: అభివృద్ధి మంత్రమే (పిక్చర్స్)
హైదరాబాద్: విభాజిత ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాజధాని ఎక్కడ పెట్టాలనే విషయాన్ని సమస్యగా తయారు చేయకుండా అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని పారిశ్రామికవేత్తలు, ఐటి నిపుణులు అభిప్రాయపడ్డారు. వనరులను విస్తృతరీతిలో వినియోగించుకుంటే సీమాంధ్రలో రెట్టింపు అభివృద్ధి సాధించవచ్చని పారిశ్రామికవేత్తలు, ఐటి నిపుణులు అభిప్రాయపడ్డారు.
రాజధానిని కేవలం పాలనా సౌలభ్యం కోసమే నిర్మించుకొని, మిగతా అభివృద్ధిని అన్ని జిల్లాకూ వికేంద్రీకరించాలన్నారు. రాష్ట్ర విభజన ఖరారైన నేపథ్యంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అవకాశాలపై సీమాంధ్ర పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ (ఎపిజెఎఫ్) హైదరాబాద్లో శుక్రవారం సదస్సు నిర్వహించింది.
అభివృద్ధి వికేంద్రీకరణే సీమాంధ్రలో ముఖ్యమని, ఫలితంగా అత్యంత త్వరితగతిన మంచి ఫలితాలు సాధించవచ్చని రాజధాని అంశం అంతప్రాధాన్యం కాదని సదస్సులో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. విడిపోయామని బాధపడకుండా వనరులను సక్రమంగా వినియోగించుకొని దేశంలో ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలపాలన్నారు. రాబోయే కొత్తప్రభుత్వం సహకారమందిస్తే పరిశ్రమలు స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నామని పారిశ్రామికవేత్తలు తెలిపారు.

హైదరాబాద్కే రావాలా..
పదివేల రూపాయల జీతం కావాలంటే సీమాంధ్ర యువకులు హైదరాబాద్కు రావాల్సిన పరిస్థితి ఉందని, మనమే ఉద్యోగాలు సృష్టిస్తే వారికి ఆ దుస్థితి ఎందుకుంటుందని, సీమాంధ్రలో భూమి, నీళ్లు, ఓడరేవులున్నాయని, పెట్టుబడిదారులూ శ్రామికులూ ఉన్నారని వక్తలు అన్నారు.

అన్ని వసతులూ ఉన్నాయి..
పరిశ్రమల స్థాపనకు అనువుగా సీమాంధ్రలో అన్ని వసతులూ ఉన్నాయని, అయినా పాలకులు ఇంతవరకు శ్రద్ధపెట్టలేదని, భువనేశ్వర్-చెన్నై మధ్యలో ఉన్న ప్రాంతం అభివృద్ధికి ఎంతో అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఉమ్మడి ప్రణాళిక అవసరం
వచ్చే ఎన్నికల్లో రాజకీయపార్టీలు కనీస ఉమ్మడి కార్యక్రమం తమ మేనిఫెస్టోలో చేర్చాలని, కనీసం ఒక్క వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ అయినా సీమాంధ్రలో ఏర్పాటు చేస్తామని చెప్పాలని, సీమాంధ్ర ప్రాంతంలో జన్మించిన పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టి తమ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వక్తలు అన్నారు.

అన్ని రంగాల్లో..
భూముల ధరలు కోట్లలో చెప్పి, పరిశ్రమలువద్దని ఆందోళనలు చేపడితే మరింత వెనుకబాటు తప్పదని అన్నారు. విశాఖపట్నంలో ఫార్మారంగం, టూరిజం; విజయవాడలో విద్య, వైద్యం, లాజిస్టిక్స్ రంగాల్లో ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేయవచ్చునని, తిరుపతి పరిధిలో ఉత్పత్తుల రంగం, శ్రీహరికోట ప్రాంతంలో ఏరోబేస్ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉంటుందని చెప్పారు.

ఆందోళనలు వద్దు...
అనంతపురంలో ఖనిజాలున్నాయి, శ్రీకాకుళంలో మానవవనరులున్నాయి అయినా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉన్నాయంటే పాలకుల నిర్లక్ష్యమే కారణమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్రలో పెట్రోకెమికల్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు వేల కోట్లు నిధులు వస్తాయని అన్నారు. వీటిని అడ్డుకోవడానికి ఆందోళనలు చేయకూడదని సూచించారు.

అనంతపురంలో స్టీల్ప్లాంట్, చిత్తూరులో ఎన్టిపిసి, కృష్ణపట్నం భూముల్లో
పరిశ్రమలు ఏర్పాటుచేస్తే స్థానిక యువకులకు ఉద్యోగాలు లభించడమేగాక కొత్తరాష్ట్రానికి రెవిన్యూ పెరుగుతుందని, అభివృద్ధిని వికేంద్రీకరించకుండా హైదరాబాద్పై ప్రేమ పెంచుకోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని అన్నారు.












Click it and Unblock the Notifications