సీఎం జగన్ కాన్వాయ్ ని అడ్డుకునే యత్నం చేసిన రాజధాని రైతులు ... అడ్డుకున్న పోలీసులు
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు ఏపీలో కాక రేపుతున్నాయి . ఇక ఈ వ్యాఖ్యలపై ఇంత రగడ జరుగుతున్నా సీఎం జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించటం తన స్పష్టమైన వైఖరిని చెప్పక పోవటంతో రైతులు ఆందోళన బాట పట్టారు. రాజధాని ప్రాంత రైతులు రాజధాని తరలింపు ఆలోచన సమంజసం కాదని మండిపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి తమ గోడు విన్నవించుకున్న రైతులు మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన బాట పట్టారు.

రాజధాని తరలింపు రగడ ... వరుస ఆందోళనలతో రాజధాని రైతులు
రాజధాని తరలింపుపై జరుగుతున్న రగడ నేపధ్యంలో జగన్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు మొన్నటికి మొన్న తుళ్లూరు మండలం వెలగపూడిలో రాస్తారోకో నిర్వహించారు. వాహనాలను నిలిపివేసి రహదారిపై బైఠాయించిన రైతులు రాజధాని ముంపు ప్రాంతంలో లేదని, రాజధానిని తరలించే యోచనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక క్రిష్ణాయపాలెంలోనూ రోడ్ మీద బైఠాయించి ఆందోళన చేసిన రైతులు రాజధాని తరలిస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంతవరకు తమకు కౌలు డబ్బులు చెల్లించలేదని పేర్కొన్న రైతులు సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎర్రబాలెం గ్రామంలో రోడ్డెక్కిన రాజధాని రైతులు .. పార్టీలకు అతీతంగా రైతులకు నాయకుల మద్దతు
ఇక మరోపక్క ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు వరుస ఆందోళనలతో ఏపీలో రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇక రాజకీయ నాయకులు ఎవరికి తోచిన ప్రకటన వారు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు . దీంతో గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఎర్రబాలెం గ్రామంలో రాజధాని రైతులు రోడ్డెక్కారు. రాజధాని తరలిస్తే ఊరుకునేది లేదని వారు తేల్చి చెప్పారు. ఇక చాలా మంది వివిధ పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు. జగన్ ఇప్పటికీ , ఇంత జరుగుతున్నా స్పందించకపోవటం దారుణం అని అభిప్రాయపడ్డారు.

జగన్ కాన్వాయ్ని అడ్డుకునే యత్నం చేసిన కృష్ణాయపాలెం రైతులు... అడ్డుకున్న పోలీసులు
ఇక తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజధాని రైతులు తమ నిరసన తెలిపే ప్రయత్నం చేశారు . ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులంతా ఏకమై నినాదాలు చేశారు. రాజధాని మార్పు అంశంపై రైతులు గ్రామస్థాయిలో ఆందోళన చేసిన రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. మంగళగిరి మండలం, కృష్ణాయపాలెం వద్ద రాజధాని రైతులు జగన్ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధాని తరలింపు పై జరుగుతున్న ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ వారు మంత్రులు చేస్తున్న ప్రకటనలలో గందరగోళం నెలకొందని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ రైతులకు సమాధానం చెప్పాలని, స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ జగన్ కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు . దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పక్కకు తరలించారు. జగన్ కు తమ ఆందోళన తెలియజెయ్యాలన్న ఉద్దేశంతోనే రైతులు కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications