'సాక్షిలో అసత్య ప్రచారం': జగన్, భార్య భారతిలపై కేసు
విజయవాడ/గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదయింది. ఈ విషయాన్ని ఎస్సై తెలిపారు.
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో 50 ఎకరాల వాగు పోరంబోకు భూమిని ఆక్రమించుకున్నారని గత నెల మూడో తేదీన సాక్షి మీడియాలో ప్రచారం జరిగిందని, తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లే విధంగా చేశారని వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ గత నెల ఆరో తేదీన ఎమ్మెల్యే ధూళిపాళ్ల లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి జగన్, సాక్షి దినపత్రిక ప్రింటర్, పబ్లిషర్ కె రామచంద్రమూర్తి, ఎడిటర్ వి మురళీ, జగతి పబ్లికేషన్స్ ఛైర్మన్ వైయస్ భారతీ రెడ్డి, జగతి పబ్లికేషన్స్ డైరెక్టర్లు, ఇందిరా టెలివిజన్ డైరెక్టర్లు, తదితరులపై 500, 501, రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆదివారం తెలిపారు.
జగన్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు
వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కతని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున రెడ్డి కడప జిల్లాలో మండిపడ్డారు. రాజంపేటలో ప్రభుత్వ బీసీ హాస్టల్లో కేంద్ర విద్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.