బాబు గొంతు కాదు, ఎవరూ అరెస్టు చేయలేరు: పరకాల ప్రభాకర్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్కు మధ్య జరిగిన సంభాషణ అంటూ విడుదలైన ఆడియో టేప్పై ఎపి మీడియా ప్రతినిధి పరకాల ప్రభాకర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. అది చంద్రబాబు గొంతు కాదని, తమ ముఖ్యమంత్రి స్టీఫన్సన్తో మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇది నీచమైన, క్షుద్రమైన చర్య అని, కుట్ర అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తేలికగా తీసుకోబోమని ఆయన అన్నారు.
తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి ప్రకటన తర్వాత ఆ మేరకు ఈ టేప్ విడుదలైందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కార్యాలయం నుంచి అది విడుదలైందని ఆయన అన్నారు. ఇవాళ టేప్ను బయటపెట్టి, చంద్రబాబు మాటలని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఆ టేప్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, హోం మంత్రి నాయని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇస్తారని తాను అనుకోవడం లేదని, అంత సాహసం చేస్తారని భావించలేమని, చంద్రబాబును ఎవరూ అరెస్టు చేయలేరని ఆయన అన్నారు.

ఆ సంభాషణలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని, టెలిఫోన్ ట్యాప్ చేశారా బయపెట్టాలని ఆయన డిమాండ్చేశారు. చంద్రబాబు ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలను గుదిగుచ్చి ఆ టేప్ను రూపొందించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. టెలిఫోన్ ట్యాప్ చేసి ఒక సంభాషణను బయటపెట్టినా, ఎక్కడెక్కడి మాటలనో గుదిగుచ్చి టేప్ తయారు చేసినా నేరమని ఆయన అన్నారు. నోటుకు ఓటు కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఈ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, దాని లోతూ అంతూ చూస్తామని, ఈ చర్యకు పాల్పడినవారిని వదిలిపెట్టబోమని ఆయన అన్నారు. వారిని జైలుకు పంపిస్తామని ఆయన అన్నారు. రేపు తాము తలపెట్టిన మహాసంకల్ఫ బహిరంగ సభను భగ్నం చేయడానికి కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగబద్గంగా ఏర్పడిన ప్రభుత్వం పట్ల, మంత్రిమండలికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి పట్ల ఉమ్మడి రాజధానిలో ఓ ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా అని ఆయన అడిగారు. దీనికి కారణమైనవారు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, ప్రజల స్వేచ్ఛ, ఆస్తులకు గవర్నర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. గవర్నర్ బాధ్యతలు తీసుకున్నప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇద్దరు ముఖ్యమంత్రులకు సరిసమానమైన హక్కులుంటాయని ఆయన అన్నారు. దీనిపై రాజ్యాంగపరంగా, చట్టపరంగా, న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సంబురాలు చేసుకుంటున్నప్పుడు రాష్ట్ర విభజన వల్ల తమకు కలిగిన కష్టనష్టాలను చెప్పుకుని, సవాళ్లను గుర్తించి, లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి మహాసంకల్ప బహిరంగ సభను రేపు తలపెట్టామని, ఆ సభను పాడు చేయడానికి, స్ఫూర్తిని దెబ్బ తీయడానికి, ప్రజల మనో స్థయిర్యాన్ని దెబ్బ తీయడానికి ఈ విధమైన కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కుట్రలను సహించేది లేదని ఆయన అన్నారు. రేపటి సభను వాయిదా వేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోందని, అందులో నిజం లేదని, సభ జరిగి తీరుతుందని ఆయన అన్నారు.
నోటుకు ఓటు కేసులో సాక్ష్యాలన్నీ సమర్పించాలని కోర్టు చెప్పిందని, వాటిని కోర్టుకు సమర్పించినప్పుడు ఈ తాజా టేప్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎసిబి ఉన్నతాధికారులు, తెలంగాణ హోం మంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ టేప్ సాక్ష్యాధారాలకు సంబంధించింది కానప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications