సీఎం జగన్ పైన మాజీ జేడీ ప్రశంసలు: పవన్ అభిప్రాయలకు భిన్నంగా..లక్ష్మీ నారాయణ ఇలా..!!
ఏపీ రాజకీయాల్లో ఊహించలేని పరిణామం. నాడు జగన్ ను కేసుల పేరుతో వెంటాడారు. నేడు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి..అభిప్రాయాలకు భిన్నంగా లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. జనసేన నేత లక్ష్మీ నారాయాణ కొద్ది రోజులుగా పార్టీ రాజకీయాల్లో కొంత గ్యాప్ పాటిస్తున్నారు. పవన్ తన సేవలు వద్దనే వరకూ జనసేన లోనే ఉంటానని గతంలోనే లక్ష్మీనారాయణ స్పష్టం చేసారు. ఒక వైపు పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే మాజీ జేడీ ముఖ్యమంత్రి మధ్య నిషేధం మీద తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశంసించారు. ముఖ్యమంత్రి నిర్ణయాలను మార్పు సాధ్యమని కితాబిచ్చారు. అయితే, ముఖ్యమంత్రి మధ్య నిషేధం అమలు చేయలేరంటూ కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ముఖ్య నేత లక్ష్మీ నారాయణ భిన్నంగా స్పందించటంతో కొత్త చర్చ మొదలైంది.
ముఖ్యమంత్రి పైన మాజీ జేడీ ప్రశంసలు..
ముఖ్యమంత్రి జగన్ పైన గతంలో సీబీఐ కేసులు నమోదు చేసిన సమయంలో విచారించిన అధికారిగా మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పేరు అందరికీ సుపరిచితమైంది. ఆయన అధికారిగా తన విధులు తాను నిర్వర్తించినా..టీడీపీ నేతలకు.. వారి మద్దతు మీడియాకు విచారణలోని విషయాలను వెల్లడించారంటూ అప్పట్లోనే వైసీపీ నేతలు విమర్శించేవారు. ఆయన చంద్రబాబు కనుసన్నల్లో పని చేస్తన్నారంటూ ఆరోపించేవారు. జగన్ కేసుల విషయంలో ఆయన కక్ష్య పూరితంగా వ్యవహరించారనే ప్రచారమూ సాగింది. అయితే, ఆ తరువాత లక్ష్మీ నారాయణ ఇక్కడి నుండి బదిలీ పైన వెళ్లారు. స్వచ్చంద పదవీ విరమణ చేసి.. అనేక తర్జన భర్జనల తరువాత జనసేనలో చేరారు. ఆయన విశాఖ నుండి ఎంపీగా పోటీ చేసారు. జెడీని గెలిపించుకొనేందుకు స్వయంగా పవన్ కళ్యాణ్ అదే పార్లమెంట్ పరిధిలోని గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసారు. అయితే వైసీపీ హవాలో ఇద్దరూ ఓడిపోయారు. ఆ తరువాత లక్ష్మీ నారాయణ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనటం లేదు. ఆయనకు కీలకమైన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ .. పార్టీ పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించలేదు. దీంతో మాజీ జేడీ పార్టీ మారుతారనే ప్రచారం సాగినా..ఆయన ఖండించారు. ఇక, ఇప్పుడు తాజాగా శ్రీకాకుళంలో ఒక కార్యక్రమంలో లక్ష్మీ నారాయణ ముఖ్యమంత్రి జగన్ పైన ప్రశంసలు కురిపించారు.

పవన్ వ్యాఖ్యలకు భిన్నంగా జేడీ...
ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. మద్య పాన నిషేధం దిశగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను అభినందించారు. మద్యపాన నిషేధం జరిగితే సమాజానికి మేలు జరుగుతుందని వివరిస్తూనే.. ముఖ్యమంత్రి మద్య పాన నిషేధం విషయంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రశంసించారు. అయితే, జగన్ పైన జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించటం...అనుకూలంగా మాట్లాడటం ఇదే తొలిసారి. అయితే, గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే మద్యపాన నిషేధం విషయంలో ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ కాలేరని..అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించామని.. మద్యపాన నిషేధం దిశగా ఇది తొలి అడుగు అంటూ చెప్పుకొచ్చారు. అయితే, పవన్ అభిప్రాయాలను భిన్నంగా ఇప్పుడు అదే పార్టీకి చెందిన ముఖ్య నేత ప్రభుత్వాన్ని అభినందించటం పైన రాజకీయంగా చర్చ మొదలైంది. తూర్పు గోదావరి దిండిలో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే శ్రీకాకుళం జిల్లాలో లక్ష్మీ నారాయణ ఈ కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే..మాజీ జేడీ స్వయంగా ముఖ్యమంత్రికి అనుకూలంగా మాట్లాడటం పైన అటు టీడీపీలోనూ చర్చ మొదలైంది. ఇక, దీని మీద రాజకీయంగా ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications