వివేకా హత్య కేసు - పులివెందుల కేంద్రంగా : సీబీఐ మళ్లీ విచారణ మొదలు..!!
రాష్ట్రంలో సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అడుగులు వేగంగా వేస్తోంది. ఇప్పటికే కోర్టులో ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన సీబీఐ తాజాగా పులివెందుల కేంద్రంగా మరోసారి విచారణ ప్రారంభించింది. కొద్ది రోజుల క్రితం శివ శంకరరెడ్డిని సైతం ముద్దాయిగా చేరుస్తూ సీబీఐ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఇక, ఈ రోజు పులివెందులలోని పులివెందుల అర్ అండ్ బీ అతిథి గృహంలో.. ముగ్గురు అనుమానితులను విచారించింది. ఒక పత్రికా విలేకరిని సైతం విచారిస్తున్నట్లుగా సమాచారం.
ఆ వ్యక్తిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారించినట్లుగా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం జిల్లాలోని జమ్మల మడుగుకు చెందిన మరో ఇద్దరు మీడియా ప్రతినిధుల నుంచి సీబీఐ కొంత సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా జరిగిన సీబీఐ విచారణలో పులివెందులకు చెందిన ఉదయ్కుమార్రెడ్డిని ప్రశ్నించింది.యురేనియం కర్మాగారంలో పని చేస్తున్న ఉదయ్కుమార్రెడ్డి గురించి.. రెండ్రోజుల క్రితమే కర్మాగారం వెళ్లిన సీబీఐ అధికారులు.. ఉదయ్ గురించి ఆరా తీశారు. వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి ప్రకాశ్రెడ్డి కుట్లు వేశారని సీబీఐ అభియోగం మోపింది.

ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఉదయ్కుమార్రెడ్డిని ప్రశ్నించింది. మరోవైపు ఇదే కేసులో డా. మధుసూదన్రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈయన పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పని చేస్తున్నారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ కేసు ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఇక, ఇప్పుడు పులివెందుల కేంద్రంగా సీబీఐ మరో సారి విచారణ మొదలు పెట్టటంతో ఈ కేసు విచారణ పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications