వివేకా కేసుపై సీబీఐ యూటర్న్..! సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ..!
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరేళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఇప్పటికే దర్యాప్తు పూర్తయినట్లు గతంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ సందర్బంగా సీబీఐ ఈ వివరణ ఇచ్చింది. అయితే దీనిపై ఇవాళ యూటర్న్ తీసుకుంది.
వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని గతంలో సుప్రీంకోర్టుకు చెప్పిన సీబీఐ.. ఇప్పుడు పిటిషనర్ ఈ కేసులో మరింత దర్యాప్తు చేయాలని కోరుతున్నందున కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వివేకా కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా తాము తదుపరి దర్యాప్తు చేపడతామని వెల్లడించింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సుదీర్ఘంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి సహా మరికొందరికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో సుప్రీంకోర్టు సీబీఐ అభిప్రాయం కోరింది. దీనికి స్పందించిన సీబీఐ.. వివేకా కేసులో దర్యాప్తు ముగిసినట్లు తెలిపింది. సుప్రీంకోర్టు కోరితే తాము దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
దీంతో సుప్రీంకోర్టు వివేకా కేసు దర్యాప్తు కొనసాగింపుపై ముందుగా సీబీఐ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. దీనికి స్పందనగా సుప్రీంకోర్టు.. పిటిషనర్ అయిన వివేకా కుమార్తె సునీతారెడ్డి అభ్యర్ధన మేరకు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశిస్తే దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం ఉత్కంఠగా మారింది. సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితుల భవిష్యత్తు కూడా ఆదారపడి ఉంటుంది.












Click it and Unblock the Notifications