వైఎస్ జగన్ కు కేంద్రం గుడ్ న్యూస్-ఎన్నికల వేళ భారీ ఊరట ..
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతూనే భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న జగన్ సర్కార్ కు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ శుభవార్త అందించారు. ఏపీతో పాటు మరో ఆరు రాష్ట్రాలకు వర్తింపచేసేలా ఓ కీలక అనుమతి మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఆర్ధికమంత్రి తెలిపారు.
విద్యుత్ రంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలకు ప్రతిఫలంగా రాష్ట్ర ప్రభుత్వం జీడీపీలో అదనంగా మరో 0.5 శాతం రుణాలు సేకరించుకునేందుకు వీలుగా అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ వెల్లడించారు. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు ఏపీకి ఈ అనుమతి మంజూరు చేస్తున్నట్లు ఆర్ధికమంత్రి తెలిపారు. ఏపీతో పాటు అసోం, కేరళ, రాజస్తాన్, సిక్కిం, బెంగాల్ కు కూడా ఈ మేరకు అనుమతులు ఇస్తున్నట్లు నిర్మలమ్మ పేర్కొన్నారు.

దేశంలో కేంద్రం సూచించిన విధంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే సాధారణంగా రాష్ట్ జీడీపీలో 3 శాతం మేర అప్పులు తీసుకునేందుకు ఉన్న వెసులుబాటుకు అదనంగా మరో 0.5 శాతం అదనపు రుణాలు తీసుకునే వీలు కల్పిస్తున్నారు. గతంలోనూ కరోనా సమయంలో రాష్ట్రాలకు కేంద్రం ఈ వెసులుబాటు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన తాజా వెసులుబాటు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జీఎస్డీపీలో 3.5 శాతం మేర అప్పులు చేసుకునేందుకు వీలు కలుగుతోంది.
గతంలో కరోనా సమయంలో 2021-22లో కేంద్రం మొత్తం 12 రాష్ట్రాలకు ఈ వెసులుబాటు కల్పించింది. అప్పట్లో ఏపీతో పాటు 12 రాష్ట్రాలు ఈ వెసులుబాటును వాడుకున్నాయి. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.3716 కోట్ల రుణాలు తీసుకుంది. ఇప్పుడు మరోసారి కేంద్రం ఇచ్చిన ఆఫర్ తో రూ.5858 కోట్ల రుణం తీసుకోబోతోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ సిఫార్సుతో రాష్ట్రాలకు ఈ మేరకు వెసులుబాటు ఇస్తున్నట్లు ఎక్స్ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications