విశాఖ మెట్రోపై కేంద్రం గుడ్ న్యూస్-నేరుగా చంద్రబాబుకే వెల్లడి..!
ఏపీలో వాణిజ్య, ఐటీ రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నానికి (vizag) కేంద్రం ఇవాళ బిగ్ న్యూస్ చెప్పింది. నగరంలో ప్రతిపాదిత కీలక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని నేరుగా సీఎం చంద్రబాబుకు కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా చెప్పారు. ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులతో భేటీలు అవుతూ లాబీయింగ్ చేస్తున్న చంద్రబాబు ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు.
గతంలో కూటమి ప్రభుత్వం విశాఖతో పాటు విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపడంతో పాటు ఆర్ధిక సాయం కూడా చేయాలని ప్రతిపాదించింది. అయితే కేంద్రం వద్ద ఈ విషయం పెండింగ్ లో ఉంది. కానీ చంద్రబాబు ఢిల్లీ టూర్ లో మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇందులో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రికే చెప్పారు.

విశాఖలో మొత్తం మూడు కారిడార్లుగా మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం జరగాల్సి ఉంది. ఇందులో మొదటి దశలో మొత్తం 46.23 కిలోమీటర్లు, 42 మెట్రో స్టేషన్లు, మూడు కారిడార్లుగా నిర్మిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అలాగే రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 8 కిలోమీటర్లు నాల్గవ కారిడార్ గా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.11,498 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో కేంద్రం నుంచి 100 శాతం గ్రాంట్ లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనిపై త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications