వైసీపీకి వచ్చే సీట్లు ఇవే- పెద్దిరెడ్డి సోదరులను ఓడించాలి : పార్టీ ఇన్ఛార్జులకు చంద్రబాబు వార్నింగ్..!!
సాధారణ ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ల సమయం ఉంది. కానీ, ఏపీలో ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల పైన ఫోకస్ పెట్టాయి. కుప్పం నియోజకవర్గం పైన వైసీపీ ఫోకస్ పెట్టగా.. ఇటు చంద్రబాబు తన సొంత జిల్లాలో తనకు ప్రత్యర్ధులుగా మారిని పెద్దిరెడ్డి సోదరుల నియోజకవర్గాల పైన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పుంగనూరు..తంబళ్లపల్లోలో పెద్దిరెడ్డి సోదరులకు డిపాజిట్లు దక్కకుండా పని చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. తంబళ్లపల్లెకు చెందిన వైసీపీ నేతలు కొందరు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

పెద్దిరెడ్డి నియోజకవర్గాలపై గురి
చిత్తూరు జిల్లాలో ఈ సారి 14 సీట్లు టీడీపీ గెలవాలని చంద్రబాబు స్పష్టం చేసారు. ఇక, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు ఎందుకు గెలవకూడదంటూ పార్టీ సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పైన చంద్రబాబు స్పందించారు. అసమర్థ పాలనతో జగన్ ఎప్పుడో జీరో అయ్యారని.. మళ్లీ గెలవటానికి ఏం సాధించారని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని సీఎం జగన్కు అర్థమైందని.., దాన్ని కప్పిపుచ్చేందుకే 175 సీట్లు గెలుస్తామని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైకాపాకు వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం
నెత్తిన పెట్టుకున్న వైకాపా కుంపటిని ఎప్పుడు దించాలా అని జనం ఎదురుచూస్తున్నారన్నారు. తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న నిరసనలు..వాటికి వస్తున్న ప్రజల స్పందనతో జగన్ ఉలిక్కిపడ్డారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్కు అర్థమైందని చెప్పారు. ఇదే సమయంలో సొంత పార్టీ నేతలకు అధినేత చంద్రబాబు కొన్ని మార్గదర్శకాలను వెల్లడించారు. నేతల వ్యవహార శైలి.. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేపట్టడంపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి మరో నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.

ఇబ్బందులు సృష్టిస్తే ..సహించేది లేదు
ఇతర నియోజకవర్గాల నాయకులకు ఇబ్బందులు సృష్టించినా, నియోజకవర్గ ఇన్ఛార్జికి వ్యతిరేకంగా గ్రూపులు కట్టినా సహించేది లేదని హెచ్చరించారు. అసెంబ్లీ..లోక్సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీలో ఎవరైనా సమాంతర వ్యవస్థలు నడిపితే ఊరుకొనేది లేదని తేల్చి చెప్పారు. మూడేళ్లుగా బయటకు రాని కొందరు పార్టీ నాయకులు..ఇప్పుడు టీడీపీ గెలుపు ఖాయమని తెలిసి క్రియాశీలకంగా మారుతున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో.. అటు టీడీపీ కంచుకోటల పైన వైసీపీ.. ఎలాగైనా వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలనే పట్టుదలతో టీడీపీ అధినేత వ్యూహాలతో ఏపీ రాజకీయంగా మరింత ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications