విడదల రజని పై టీడీపీ అభ్యర్దిగా బరిలోకి మాజీ మహిళా ఐఏఎస్..!?
ఏపీలో అభ్యర్దుల ఎంపిక పై కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. హోరా హోరీగా మారుతున్న ఎన్నికల రాజకీయంలో జగన్ - చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. జగన్ తన పార్టీ అభ్యర్దులు, ఇంఛార్జ్ ల మార్పు వేళ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. జనసేనతో పొత్తు వేళ సీటు..అభ్యర్దుల ఎంపికలో తటస్థుల ప్రయోగం చేస్తున్నారు. అందులో భాగంగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్ ఈ సారి సంక్షేమం, సామాజిక న్యాయం అస్త్రాలుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ భారీ మెజార్టీకి కారణమైంది. ఈ సారి టీడీపీ, జనసేన పొత్తుతో బీసీ, ఎస్సీ వర్గాలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా మంత్రి విడదల రజనీ సీటు మార్చారు. 2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నుంచి గెలిచిన రజనీకి ఈ సారి గుంటూరు పశ్చమం బాధ్యతలు అప్పగించారు. 2019లోనూ ఇదే సీటును జగన్ బీసీకి కేటాయించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి మద్దాలి గిరి గెలుపొందారు. తరువాత వైసీపీకి దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కడ రజనీకి సీటు ఖరారు కావటంతో చంద్రబాబు తటస్థుల కార్డు ఈ నియోజకవర్గంలో మరోసారి ప్రయోగించటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

ఈ నియోకవర్గంలో టీడీపీ వరుసగా గెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దే గెలుపొందారు. ఈ సారి ఇదే పట్టు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నుంచి బీసీ మహిళా అభ్యర్ది పోటీలో ఉండటంతో..టీడీపీ నుంచి రిటైర్డ్ మహిళా ఐఏఎస్ ను బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 1999లో ఇదే నియోకవర్గం నుంచి తటస్థు కోటాలో డాక్టర్ శనక్కాయల అరుణకు అవకాశం ఇవ్వగా..గెలిచి మంత్రి అయ్యారు. ఇప్పుడు ఈ సీటు నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో, బీసీ వర్గానికి చెందిన ఓ మహిళా ఐఏఎస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఈ అధికారిణి గతంలో గుంటూరులోనూ పని చేసారు. పొరుగు జిల్లాలో కలెక్టర్ గా పని చేసారు. సంక్షేమ శాఖలో సుదీర్ఘ కాలం అధికారిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. బీసీ వర్గానికి చెందిన ఈ మహిళా అధికారిణి భర్త రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. నియోజకవర్గంలో ఈ ఇద్దరికీ బంధుత్వం ఉంది. దీంతో బీసీ మహిళా అధికారి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల పైన వచ్చే వారం చంద్రబాబు , పవన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. దీంతో..అన్ని లెక్కలు కుదిరితే వైసీపీ నుంచి విడదల రజనీ పైన టీడీపీ అభ్యర్దిగా మహిళా అధికారి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications