నా అనుభవం అంత లేదు వీరి సర్వీసు: ముందస్తు చర్యలతో ముప్పు తప్పింది: ప్రధాని పైన బాబు విసుర్లు
కేంద్ర ఎన్నికల సంఘం..ప్రధాని మోదీ పైనా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఎన్నికల కోడ్ ఒక్కోక్కరి విషయంలో ఒక్కో విధంగా ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రధాని ఏం మాట్లాడినా ఎన్నికల సంఘానికి మ్యూజిక్ లాగా ఉంటుందన్నారు. ఏపీలో తుఫాను మందుస్తు చర్యలతో ముప్పు తప్పిందన్నారు. ఆర్టీజీఎస్ పని తీరును అభినందించారు. 2002 ముందు మోదీ..షా ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. నా అనుభవం అంత లేదు వీరి సర్వీసు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ప్రధాని ఓడిపోతున్నారనే సంకేతాలున్నాయి..
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు దశల ఎన్నికలు పూర్తయ్యాయని..అందులో మోదీ వ్యతిరేకత కనిపించిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మోదీ ఏం మాట్లాడినా ఈసీకి మ్యూజిక్ విన్నట్లుందని, ఈసీ ప్రవర్తన వింతగా ఉందని చంద్రబాబు ధ్వజమెత్తారు. 2002 ముందు మోదీ..అమిత్ షా పేర్లు ఎవరైనా విన్నారా అని ప్రశ్నించారు. తాను ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా..ప్రతిపక్ష నేతగా పని చేసిన విషయాన్ని గుర్తు చేసారు. ప్రజాస్వామ్యంలో అవకాశాలు వస్తాయని..అయితే, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏపీలో అధికారుల తీరు పైనా చంద్రబాబు ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు..ఎన్నికల సంఘం..రాష్ట్ర అధికారుల తీరు పైన మాట్లాడుతూ నా అనుభవం అంత లేదు వీరి సర్వీసు అంటూ చేసిన వ్యాఖ్య కలకలం
సృష్టించింది.

ఎన్నికల సంఘానికి అభ్యంతరం ఏంటి..
మరోసారి ఎన్నికల కమిషన్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈవీఎంలు వచ్చిన నాటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నానని, ఆయన పోరాటం వల్లే వీవీ ప్యాట్స్ వచ్చాయని బాబు చెప్పుకున్నారు. వీవీ ప్యాట్స్ మొత్తం లెక్కించడానికి ఈసీకి వచ్చిన నష్టమేంటని బాబు ప్రశ్నించారు. పేపర్ బ్యాలెట్ తప్ప మరో మార్గమే లేదని తేల్చిచెప్పారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బ్యాలెట్ పేపర్లనే వినియోగించాని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరుతామని స్పష్టం చేసారు. ఒక వేళ ఇవియంల వినియోగం అనివార్యమైతే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వీవీప్యాట్స్ వినియోగించాల్సిందేనని తేల్చి చెప్పారు. తాము వంద శాతం వీవీప్యాట్స్ వినియోగం కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీం స్వీకరించి పోస్టింగ్ ఇచ్చిందని..తమ వాదనకు మద్దతు ఉంటుందని బాబు అంచనా వేసారు.

ముందస్తు చర్యలతో నష్టం తగ్గింది..
టెక్నాలజీతో కచ్చితమైన సమాచారాన్ని ఇచ్చామని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ తుపాన్ 733 గ్రామాల్లో ప్రభావం చూపించిందని, తొమ్మిది మండలాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరిగాయని ఆయన వివరించారు. మరోవైపు 58 వేల మంది మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేశామని, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా 14 మందిని అప్రమత్తం చేశామని చెప్పుకొచ్చారు. మందస , ఇచ్చాపురంలో భారీ వర్షం పడిందని, ఈ మూడు పట్టణాలపై తుపాన్ ప్రభావం తీవ్రంగా పడిందన్నారు. ఇప్పటి వరకు 182 సెల్ఫోన్ టవర్లను పునరుద్ధరించామని, విద్యుత్ పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకుటున్నామని చంద్రబాబు వివరించారు. పునరావాస కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని .. 1.14 లక్షల మందికి భోజన వసతి కల్పించామని, బాధితులకు శనివారం వరకు భోజన వసతి కల్పిస్తామన్నారు.












Click it and Unblock the Notifications