చంద్రబాబుకు ఢిల్లీ పిలుపు, ఎన్డీఏలో చేరిక - బీజేపీకి సీట్లు ఖరారు..!!
ఏపీ ఎన్నికల రాజకీయంలో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. టీడీపీ, జనసేనతో బీజేపీ కలవటం పైన దాదాపు స్పష్టత వచ్చింది. అధికారిక నిర్ణయమే మిగిలి ఉంది. ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. సీట్ల పైన అంగీకారానికి వచ్చిన తరువాత టీడీపీ ఎన్డీఏలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఏపీలో మూడు పార్టీల కూటమి ఎన్నికల బరిలోకి దిగనుంది.
ఢిల్లీకి చంద్రబాబు: ఏపీలో మరోసారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. సీట్ల సర్దుబాటుపై చర్చించే నిమిత్తం టీడీపీ అధినేత చంద్రబాబును గురువారం ఢిల్లీ రావాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆహ్వానించింది. పార్టీ నేతలు బుధవారం ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. ఈ రోజు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. గత నెల 7వ తేదీన ఢిల్లీలో అమిత్ షా తో చంద్రబాబు సమావేశమయ్యారు.

అప్పుడే చర్చల ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. తిరిగి సరిగ్గా నెల తరువాత ఈ రోజు మరోసారి అమిత్ షా తో భేటీ అవుతున్నారు. అవసరమైతే శుక్రవారం కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది. ఒకట్రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని అంటున్నారు. ఈ భేటీకి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కూడా బీజేపీ పెద్దలు ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే ఆయన వెళ్లడం లేదని సమాచారం.
ఎన్డీఏలోకి టీడీపీ: టీడీపీతో పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ఢిల్లీలో రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపారు. రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ పోటీచేసే అసెంబ్లీ, లోక్సభ స్థానాలపై గురువారం చంద్రబాబుతో జరిపే చర్చల్లో అవగాహనకు వస్తే.. శుక్ర, శనివారాల్లో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పొత్తుతో పాటు అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి.
అన్నీ అనుకూలంగా జరిగితే ఈ రెండు మూడు రోజుల్లోనే టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరే అవకాశం కనిపిస్తోంది. సీట్ల పైన బీజేపీ తాము కోరినవి కేటాయించాలని పట్టు బడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి ఇచ్చే సీట్ల పైన ఇప్పటికే చంద్రబాబు, పవన్ ఒక అంచనాకుల వచ్చారు. అమిత్ షా తో చర్చల సమయంలో ఈ సీట్లకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
సీట్లు పైనే చర్చలు: 2014లో పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ 13 అసెంబ్లీ సీ ట్లు ఇవ్వగా.. ఆ పార్టీ 4 చోట్లే గెలిచింది. ఈసారి విజయావకాశాలున్న అభ్యర్థులు ఉన్నచోటే బీజేపీకి సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. బీజేపీ కోరుతున్న సీట్లలో ఆ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై టీడీపీ సర్వే కూడా చేయించింది.
బీజేపీ ప్రతిపాదించిన లోక్సభ స్థానాల్లో నరసాపురం, తిరుపతి(ఎస్సీ), అరకు(ఎస్టీ) ఉన్నాయి. అయితే బీజేపీ నేతలు 3 లోక్సభ సీట్లు.. నరసాపురం, రాజమహేంద్రవరం, ఏలూరు, రాజంపేట, తిరుపతి కోరుతున్నారు. బీజేపీకి 11 లేదా 12 అసెంబ్లీ సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దమైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీ బీజేపీ నేతలు సైతం ఢిల్లీలోనే ఉండటంతో..సీట్లు, పొత్తుల పైన అధికారికంగా నిర్ణయం పైన ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications