వరద ముంపు ప్రాంతాలకు చంద్రబాబు - బాధితులకు మద్దతుగా..!!
టీడీపీ అధినేత చంద్రబాబు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు. నాలుగు రోజులుగా భారీ వర్షాలతో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. వందలాది లంక గ్రామాలు ముంపుకు గరయ్యాయి, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాల్లో ఉంచారు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో వరద నీరు అలాగే ఉంది. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యమంత్రి జగన్ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎగువ ప్రాంతం నుంచి గోదావరికి వస్తున్న వరద కారణంగా మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు గోదావరి జిల్లాల్లో పర్యటనకు నిర్ణయించారు. ఈ నెల 21,22 తేదీల్లో చంద్రబాబు వరద ప్రభావానికి గురైన లంక గ్రామాల్లో పర్యటించనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వ తీరును చంద్రబాబు తప్పు బట్టారు. ప్రభుత్వం నిద్రవీడటం లేదంటూ వ్యాఖ్యానించారు. కనీసం మంత్రులు బాధితుల పరామర్శకు వెళ్లలేదంటూ మండిపడ్డారు. పార్టీ శ్రేణులంతా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇప్పటికే చంద్రబాబు పిలుపునిచ్చారు. తన పర్యటన సమయంలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా బాధితులకు సేవలు అందించాలని నిర్ణయించారు. వరద తీవ్రత క్రమేణా తగ్గుముఖం పడుతుండటంతో..ఆ తేదీల్లో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు.
సహాయక చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదని ఆదేశించిన ఆయన, సహాయక బృందాలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.వరద బాధిత కుటుంబాలకు రేషన్ పంపిణీ చేయాలని, ప్రతి కుటుంబానికి రూ.2 వేలు లేదా వ్యక్తికి రూ.వెయ్యి చొప్పున నగదు అందించాలని ఆదేశాలిచ్చారు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై తొలి 15 రోజుల్లోనే ఈ స్థాయిలో భారీ వర్షాలు రావటం.. గోదావరికి వరద రావటం తో ఈ సీజన్ లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక, పలు గ్రామాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి.