రాజీపడే ప్రసక్తే లేదు.. మిత్రపక్షం అని గమ్మున ఉన్నా: కేంద్రంపై చంద్రబాబు
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం సభలో విభజన హామిలపై మాట్లాడారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. స్వల్ప వ్యవధి చర్చ కింద విభజన హామీల అంశాలపై చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్కు పట్టిన గతే..:
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తే.. కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆనాడు రాజ్యసభలో ప్రధానమంత్రి ఏ అంశాలైతే చెప్పారో వాటన్నింటిని తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. అందులో ప్రత్యేక హోదా అంశం కూడా ఉందని గుర్తుచేశారు.
మిత్రపక్షం అని గమ్మున ఉన్నా..:
మిత్రపక్షం కాబట్టే ఇన్నాళ్లు గమ్మున ఉన్నానని, లేదంటే గట్టిగా ఫైట్ చేసి ఉండేవాడినని చంద్రబాబు పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనాలైతే కల్పించారో.. ఏపీకి కూడా అవి దక్కాలని డిమాండ్ చేశారు.విభజన హామిల్లో 18అంశాలు పెట్టారని, అవన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని మరోసారి గుర్తుచేశారు.
రాజీపడే ప్రసక్తే లేదు:
కేంద్రం పట్ల తాను సంయమనంతో వ్యవహరిస్తున్నానే తప్ప.. ఎక్కడా డీవియేట్ కావడం లేదన్నారు చంద్రబాబు. విభజన హామిలపై ఇప్పటికీ 29సార్లు ఢిల్లీ వెళ్లినట్టు చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవానికి, మనోభావాలకు సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
పోలవరంపై ఇలా:
దక్షిణాదిలో పర్ క్యాపిట ఇన్కమ్ తక్కువగా ఉందని దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా కేంద్రం పైనే ఉందని గుర్తుచేశారు. 2014 ఫలితాలు వచ్చిన వెంటనే.. తాను ఢిల్లీ వెళ్లి మరీ పట్టుబట్టి పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చేలా చేశానని చంద్రబాబు చెప్పారు. ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని, అంతదాకా చేయనని కేంద్రానికి తెగేసి చెప్పినట్టు వెల్లడించారు.
ప్రజల వైపే ఉంటా:
ఇక ఉమ్మడి రాజధాని గురించి ప్రస్తావిస్తూ.. 60సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నామని. ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉందంటే దాని వెనకాల నా కృషి ఎవరూ కాదనలేనిదని మరోసారి చెప్పుకొచ్చారు. ఏదేమైనా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను ప్రజల వైపే ఉంటానని స్పష్టం చేశారు.