చేనేతలకు చంద్రబాబు బంపర్ ఆఫర్..! 25 వేల నజరానా..!
జాతీయ చేనేత దినోత్సవం రోజు సీఎం చంద్రబాబు చేనేత వర్గాలకు శుభవార్త చెప్పారు. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ తో కలిసి పాల్గొన్న చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.చేనేత కుటుంబాలకు నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు ఇచ్చేలా నేతన్న భరోసా పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో జాతీయ చేనేత దినోత్సవం రోజున చేనేతలకు భారీ ఊరట దక్కినట్లయింది. అలాగే ఈ నెల నుంచి చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వనునన్నట్లు చంద్రబాబు మరో ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా 93 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని చంద్రబాబు ప్రకటించారు.

తొలిసారి నేతన్నలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చిన చరిత్ర టీడీపీది అని చంద్రబాబు తెలిపారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా టీడీపీ చేనేత కార్మికుల కోసం పోరాటం చేసిందన్నారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నా.. తనకు మొట్టమొదట గుర్తుకువచ్చేది చేనేత కార్మికులేనని తెలిపారు. నేతన్నలు నేసే బట్టలపై ఐదు శాతం జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. దీంతో పాటు రూ.110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసినట్లు చంద్రబాబు గుర్తుచేశారు.

ఏపీలో వివిధ ప్రాంతాల్లో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, తద్వారా వెంకటగిరి, మంగళగిరి, శ్రీకాళహస్తి, ఉప్పాడల్లో 1374 మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో పాటు అమరావతిలో త్వరలోనే హ్యాండ్ లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆదరణ-3 కింద చేనేతల కోసం మరిన్ని కొత్త పథకాలు
అమలు చేస్తామని సీఎం వెల్లడించారు.












Click it and Unblock the Notifications