ఆటోను ఢీకొన్నఆర్టీసీ బస్సు-7గురు బలి-5 లక్షలు ప్రకటించిన చంద్రబాబు..!
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని గార్లదిన్నె మండలం తలగాసుపల్లెలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో నలుగురి పరిస్ధితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యవసాయ కార్మికులు మృత్యువాత పడటంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

అటు ఆటో ప్రమాదంపై హోంమంత్రి అనిత కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొని వ్యవసాయ కూలీలు ఏడుగురు చనిపోవడం శోచనీయమన్నారు. ప్రమాదంలో గాయపడిన ఆరుగురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అదించాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న పోలీసులతో పాటు వైద్య సిబ్బందిని అలర్ట్ చేసి బాధితుల్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications