27 ఏళ్ల తరువాత ..నందమూరి కుటుంబానికి టీడీపీ పగ్గాలు..!
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో వందల కోట్లు చేతులు మారినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందనే కారణంతోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
అనంతరం చంద్రబాబును కోర్టులో హాజరుపర్చడం..ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం అన్ని కూడా చక చక జరిగిపోయాయి.చంద్రబాబు అరెస్ట్ కావడంతో.. టీడీపీ వర్గాలు ఒక్కసారిగా షాక్కు గురైయ్యాయి. ఇప్పటికిప్పుడు బెయిల్ వస్తుందనే ఆశలు కూడా టీడీపీ నేతల్లో కనిపించడం లేదు.దీంతో తదుపరి కార్యచరణపై టీడీపీ నేతలు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా చంద్రబాబు జైల్లో ఉన్న ప్రస్తుత పరిస్థుతుల్లో టీడీపీని ఎవరు ముందుండి నడిపిస్తారా అని పార్టీ క్యాడర్ చాలా అతృతుగా ఎదురు చూస్తుంది.

పార్టీ వ్యవహారాలను బాలకృష్ణను దగ్గరుండి చూసుకోవాలని చంద్రబాబు సూచించారని సమాచారం. ఇటువంటి తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే , చంద్రబాబు బామర్ది బాలకృష్ణ పార్టీని ముందుకు నడిపించడానికి సిద్దం అవుతున్నారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన బాలకృష్ణ దీనిపై స్పష్టతను ఇవ్వడం జరిగింది. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరినీ కలుస్తామన్నారు. నేనొస్తున్నా.. ఎవరూ భయపడాల్సిన పనిలేదని బాలకృష్ణ పార్టీ కార్యకర్తలకు భరోసానిచ్చారు.

తండ్రి చంద్రబాబు జైల్లో ఉండటంతో నారా లోకేష్ పార్టీకి నాయకత్వం వహిస్తారని అందరు భావించారు. ఈ సమయంలో పార్టీ బాధ్యతలు తీసుకోవడం సరైంది కాదని నారా లోకేష్ భావించడంతోనే...ఆ స్థానాన్ని బాలకృష్ణకు ఇస్తున్నారని తెలుస్తుంది. దీంతో టీడీపీ పగ్గాలు బాలకృష్ణ చేపట్టడం లాంఛనమే అయింది. 27 ఏళ్ల తరువాత టీడీపీకి నందమూరి వంశం తిరిగి నాయకత్వం వహిస్తుంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు దగ్గర నుంచి చంద్రబాబు పార్టీని కైవసం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.

అప్పటి నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబే టీడీపీకి నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. చంద్రబాబు అనంతరం పార్టీ బాధ్యతలను నారా లోకేష్కు ఇచ్చేందుకు సన్నద్దం అవుతున్న తరుణంలో..అధినేత అరెస్ట్ కావడం టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైయ్యారు. ప్రస్తుతం తరుణంలో బాలకృష్ణనే పార్టీని నడిపించడం సరైందని చంద్రబాబు భావించారు. ఆయన సూచనల మేరకే బాలకృష్ణ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించి.. ప్రజల్లోకి వస్తున్నానని ప్రకటించారని తెలుస్తుంది.చంద్రబాబు జైలు నుంచి రాగానే తిరిగి పార్టీ పగ్గాలు ఆయనకు ఇవ్వడం జరుగుతుందని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications