ప్రాణాలైనా అర్పిస్తా: టిలో బాబు, కెసిఆర్ని ఏకిపారేశారు
ఖమ్మం: తెలంగాణలో బిసిల రాజ్యం ఏర్పాటు చేస్తామని, సామాజిక తెలంగాణ కోసం ప్రాణాలైనా అర్పిస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజాగర్జన సభలో చంద్రబాబు మాట్లాడారు. పేదవాడికి రాజ్యాధికారమిస్తామన్నారు. టిడిపి గెలుపు చారిత్రక అవసరమని, భద్రత, భవిష్యత్తు టిడిపితోనే సాధ్యమన్నారు. తెరాసకు అధికారిమిస్తే తెలంగాణను అమ్ముకుంటారన్నారు.
కాంగ్రెస్ పార్టీ పది తలల రావణాసురుడని, వాటిలో ఒక తల జగన్ అయితే ఇంకొక తల కిరణ్, మరొక తల కెసిఆర్ అన్నారు. అన్ని తలలను నరికితేనే దేశానికి మేలు జరుగుతుందన్నారు. తెలంగాణలో దొరలు, పెత్తందారీ భూస్వాముల పాలన రానివ్వబోమని స్పష్టం చేశారు. తెరాసకు అధికారమిస్తే తెలంగాణను దోచుకుంటారని, దళితుడిని ముఖ్యమంత్రిని, మైనారిటీని ఉప ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కెసిఆర్ అవకాశం రాగానే తానే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడని, ఇదే అతని సామాజిక న్యాయమన్నారు.

అలాంటి వసూళ్ల రాజా.. దుర్మార్గుడు అధికారంలోకి వస్తే తెలంగాణ నాశనమవుతుందని, కుటుంబంతోపాటు ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ ముందు మోకరిల్లి ఆ దేవత వల్లే తెలంగాణ వచ్చిందన్నాడు. తీరా హైదరాబాద్ రాగానే తెలంగాణ ఇచ్చిన సంగతే తనకు చెప్పలేదని చెబుతున్నాడని, 2009లో టిడిపితో పొత్తు పెట్టుకున్నాడన్నారు. ఫలితాలు రాకముందే తనను బిజెపికి అమ్మే ప్రయత్నం చేశాడని, కెసిఆర్కు ఓట్లు వేస్తే రేపు తెలంగాణను అమ్మేస్తాడన్నారు.
సామాజిక తెలంగాణ కోసం ప్రాణాలైనా అర్పిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన ప్రజల రాజ్యం స్థాపిస్తానని, చివరి రక్తపు బొట్టు వరకు పేదల కోసం పని చేస్తానని పునరుద్ఘాటించారు. రెండు రాష్ట్రాల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పారు. జగన్ పార్టీని, తెరాసను నమ్ముకుని తెలంగాణలో టిడిపిని దెబ్బ తీయాలనుకుని కాంగ్రెస్సే నష్టపోయిందని మండిపడ్డారు.
టిడిపి ఏనాడు తెలంగాణను వ్యతిరేకించలేదని, విద్యార్థుల ప్రాణాలను కాపాడేందుకు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని, అదే సమయంలో ఆంధ్రా ప్రాంతానికి సమ న్యాయం చేయాలని కొట్లాడింది కూడా తానేనని, ఇది తప్పా అని ప్రశ్నించారు. దొరల రాజ్యం వస్తే బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు బలైపోతారని ఆందోళన వ్యక్తం చేశా రు. అందుకే, బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని టిడిపి ప్రకటించిందని, దీంతో కలవరపడిన కాంగ్రెస్ రెండు ప్రాంతాల్లో ఇద్దరు బిసిలను పిసిసి అధ్యక్షులను చేసిందని, ఇప్పుడు కెసిఆర్ కూడా బిసిలకు అగ్రతాంబూలం ఇస్తానని మాయమాటలు చెబుతున్నాడని మండిపడ్డారు.
తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు తెరాస టికెట్ ఇవ్వకపోతే తామే ఇస్తామని తెలంగాణ టిడిపి నేతలు ప్రకటించారు. అమరవీరుల శవాలతో తెరాస వసూళ్ల దందా సాగించిందని వాళ్లు ఆరోపించారు. కెసిఆర్కు ఇప్పుడు అమరులు గుర్తుకు రావడం లేదా అని వాళ్లు ప్రశ్నించారు. తెలంగాణ గుమ్మం ఖమ్మంలో నిర్వహించిన టిడిపి తొలి ప్రజాగర్జన సభకు తెలంగాణ టిడిపి ముఖ్యనేతలు హాజరయ్యారు.
ఎర్రబెల్లి దయాకర్రావు, మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాష్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, ఉమా మాధవ రెడ్డి, ఎల్ రమణ, రమేష్ రాథోడ్, నామా నాగేశ్వర రావు, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు ఈ సభకు హాజరయ్యారు. సభ ప్రారంభంలో చంద్రబాబు మహిళలకు శిరస్సు వంచి అభివందనం చేశారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి, తర్వాత తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. పలుమార్లు సామాజిక తెలంగాణ విషయాన్ని ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications