దీపాన్ని ఆర్పేశారు, ఫేక్ సిటీని తెచ్చారు: చంద్రబాబు
హైదరాబాద్: పదేళ్ల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీకి, రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
పదేళ్ల తన పాలనలో నిర్మించిన అభివృద్ధి నిర్మాణాలను కాంగ్రెస్ అవినీతి తుడిచిపెట్టేసిందని, ఫ్యాబ్ సిటీని కాస్తా ఫేక్ సిటీగా మార్చివేసిందని మండిపడ్డారు. వాజ్పేయి ప్రభుత్వాన్ని అభ్యర్థించి రాష్ట్రంలోని మహిళల కోసం దీపం పథకం కింద 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు టీడీపీ సర్కారు సమకూరిస్తే కాంగ్రెస్ పాలకులు ఆ దీపం ఆర్పేశారని మండిపడ్డారు.
హైదరాబాద్కు పూర్వవైభవం తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. అమెరికా, చైనాల కంటే మిన్నగా దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని అన్నారు.తెలుగుదేశం, బిజెపి కూటమితో ఏర్పడే ప్రభుత్వం ఆదిశగా చర్యలు చేపడుతుందన్నారు. బిజెపి, టిడిపిఎన్నికల పొత్తు చారిత్రక అవసరంగా అభివర్ణించారు. తాము అధికారంలోకి వస్తేచేవెళ్ల-ప్రాణహితని పూర్తిచేస్తామని, తెలంగాణ ప్రాంతానికి ఎత్తిపోతల ద్వారా సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ క్యాంటిన్ ఏర్పాటు చేసి రూ.5లకే భోజనం అందిస్తామని, రూ.2లకే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తాంమని చెప్పారు. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తామని, దోచుకుని దాచుకున్న డబ్బుల్ని కక్కిస్తామని హెచ్చరించారని అన్నారు. జగన్ది జైలు పార్టీ అని, అది సోనియాకు అమ్ముడుపోతుందని విమర్శించారు.
నీతి, నిలకడలేని పార్టీలుగా తెరాసను, వైయస్సార్ కాంగ్రెసును అభివర్ణించారు. కొడుకు, కూతురు, మేనల్లుడికి అధికారాన్ని అప్పగించాలన్న ఆతృతతో కేసీఆర్ ఉన్నారని దుయ్యబట్టారు.రాహుల్గాంధీకి దేశం గురించి ఏమీ తెలియదని అన్నారు. రాహుల్ గాంధీని మొద్దబ్బాయితో చంద్రబాబు పోల్చారు.