ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీ: జగన్కు చాన్స్, లెఫ్ట్తో జత
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజీ పడినట్లే కనిపిస్తున్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదనే విషయం చంద్రబాబుకు ముందే తెలుసునని ఇటీవల తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా, ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తెద్దామని ఆ మధ్య చంద్రబాబు మంత్రులతో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
ప్రత్యేక హోదా సాధిస్తామని తెలుగుదేశం పార్టీకి చెందిన సుజనా చౌదరి వంటి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు. అయితే, వారి మాటలను నమ్మే పరిస్థితి లేదనేది అర్తమవుతూనే ఉంది. ఎపికి ప్రత్యేక హోదా రాదనే విషయం దాదాపుగా ఖరారై పోయింది. ఈ స్థితిలో చంద్రబాబుపై పోరుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు.
తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ ప్రభుత్వంపై పోరాడేందుకు వైయస్ జగన్కు మంచి అవకాశం లభించినట్లే. ఆ అవకాశాన్ని తీసుకుని జగన్ చంద్రబాబుపై పోరుకు సిద్ధపడ్డారు. సిపిఐ, సిపిఎం ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో పోరాటం సాగిస్తున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బస్సు యాత్ర కూడా చేపట్టారు. ప్రత్యేక హోదా కోసం సిపిఐ బస్సు యాత్ర ద్వారా వివిధ వర్గాల మేధావులను, ప్రజలను కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
అదే సమయంలో సిపిఐ, సిపిఎంతో కలిసి పనిచేయడానకి వైయస్ జగన్ సిద్ధపడ్డారు. ఢిల్లీలో తాను ఈ నెల 10వ తేదీన జరిపే ధర్నాకు మద్దతు పలకాలని జగన్ ఆ పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు. జగన్తో కలిసి పనిచేసేందుకు వామపక్షాలు కూడా సిద్ధపడినట్లు కనిపిస్తోంది.
తెలుగుదేశం, బిజెపిలను ఎండగట్టే కార్యక్రమంలో భాగంగా జగన్తో వామపక్షాలు చేతులు కలుపుతున్నాయి. ప్రత్యేక హోదాపై భవిష్యత్తులో రాష్ట్రంలో ఆందోళనలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, వైయస్ జగన్ కూడా బిజెపికి భయపడి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం లేదని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన అనంతపురం జిల్లా పర్యటనలో విమర్శించారు.
అంది వచ్చిన అవకాశాన్ని జగన్ ఏ మేరకు వాడుకుంటారనేది తెలియదు. ఆయన ఒక్క రోజు దీక్షతో ముగిస్తారా, పోరాటాన్ని కొనసాగిస్తారా అనేదాన్ని బట్టి ఆయన పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.