'టిడిపిలో వైసీపీ విలీనం, ఏపీలో మరో 30 ఏళ్లు బాబు ఫ్యామిలీ రాజ్యమే!'
విజయవాడ: తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు బుద్ధా వెంకన్న గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, అలాగే, టిడిపి అధినాయకత్వం పైన కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ రాష్ట్రం గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ముప్పై ఏళ్లు టిడిపి నాయకత్వమే ఉంటుందని, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు కుటుంబమే నాయకత్వం వహిస్తుందని చెప్పారు.
తద్వారా చంద్రబాబు తర్వాత ఆ పార్టీ యువనేత నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పకనే చెప్పారు. లోకేష్ కోసం పదవులు వదులుకునేందుకు కూడా కొంతమంది నేతలు సిద్ధపడ్డ విషయం తెలిసిందే. అయితే, లోకేష్ మాత్రం తాను 2019కి సిద్ధమని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ నాయకులకే నమ్మకం లేదని చెప్పారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో వైసిపి విలీనం కావడం ఖాయమని చెప్పారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారని చెప్పారు.
కాపులకు ఇచ్చిన హామీ నెరవేరుస్తాం: చినరాజప్ప
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. కాపుల విషయంలో మాకు మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు. ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. అలాగే, ప్రభుత్వాన్ని ఎవరూ బ్లాక్ మెయిల్ చేయలేరన్నారు. తొమ్మిది నెలల్లో కాపు కమిషన్ పూర్తి చేస్తుందని చెప్పారు.