'ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే..! సస్పెండ్ చేస్తా జాగ్రత్త..' : చంద్రబాబు సీరియస్ వార్నింగ్
విజయవాడ : ఏపీ సచివాలయ ఉద్యోగులను అమరావతికి తరలించాలనే ప్రభుత్వ యోచనకు ఉద్యోగుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. ఇప్పటికే తమ నిరసన గళం వినిపిస్తున్న ఉద్యోగులు బీజేపీ నేత పురంధరేశ్వరికి కూడా విన్నవించుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇదే విషయమై విన్నవించడానికి సీఎం చంద్రబాబు నాయుడుని ఏపీ గెజిటెడ్ అధికారుల ఫోరం నేతలు కలవగా.. సీఎం చంద్రబాబు అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడినట్టు సమాచారం. ఉద్యోగుల తరలింపు ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతూ గెజిటెడ్ అధికారులు సీఎం చంద్రబాబును ఆశ్రయించగా, తీవ్ర అసహనానికి లోనైన చంద్రబాబు గెజిటెడ్ అధికారులకు ఎదురు ప్రశ్నలు వేసినట్టు సమాచారం.
ఈ సందర్భంగా చంద్రబాబుకు తమ సమస్యల గురించి వివరిస్తూ.. 'ఉద్యోగుల తరలింపు ప్రక్రియకు సంబంధించి ఎలాంటి రోడ్డు మ్యాప్, డైరెక్షన్స్ ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని, అలాగే ఉద్యోగుల కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని' గెజిటెడ్ ఫోరం అద్యక్షుడు ఏవీ పటేల్ చంద్రబాబుతో విన్నవించినట్టు తెలుస్తోంది.
కాగా, ఏవీ పటేల్ వివరణపై మండిపడుతూ.. 'ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా..? ఒక సీఎంతో ఎలా మాట్టాడాలో ఆ మాత్రం తెలియదా..!' అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అంతేకాదు, 'ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే ఇంటికి పంపిస్తా..!' అంటూ ఏవీ పటేల్ కి చంద్రబాబు హెచ్చరికలు కూడా జారీ చేశారని తెలుస్తోంది.
ఇదే విషయాన్ని మరింత తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు.. 'మాకు నచ్చినట్టు వ్యవహరిస్తామంటే.. ఇప్పుడే సస్పెండ్ చేస్తా.. జాగ్రత్త..' అంటూ గెజిటెడ్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగుల తరలింపు ప్రక్రియను అడ్డుకోవాలంటూ ప్రతిపక్ష నాయకులను కలవడం పట్ల కూడా చంద్రబాబు మండిపడ్డారని తెలుస్తోంది.
ఇక చివరగా.. 'నాకు లేరా భార్యా పిల్లలు, వాళ్లను వదిలేసి నేనిక్కడ పనిచేయడం లేదా..?' అంటూ అధికారులను ఎదురు ప్రశ్నించారట చంద్రబాబు. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు ఆగ్రహంతో అసంతృప్తికి లోనైన ఉద్యోగ సంఘాల నేతలు మరో మాట మాట్లాడకుండా బయటకు వచ్చేసినట్టు సమాచారం.