ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతల దోపిడీ..భారీ కుంభకోణం : చంద్రబాబు ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో రగడ కొనసాగుతోంది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ లో అవకతవకలు టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలంటూ టిడిపి వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. వర్చువల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన టిడిపి ఆయా జిల్లాల్లో టీడీపీ హయాంలో నిర్మించిన గృహ సముదాయాల వద్ద నేతల నిరసన జూమ్ యాప్ ద్వారా ప్రసారం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేడు అన్ని జిల్లాల్లోనూ నిరసన తెలియజేస్తోంది.

ఇళ్ళ స్థలాల విషయంలో టీడీపీ పోరుబాట..చంద్రబాబు దిశా నిర్దేశం
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇళ్ల స్థలాల విషయంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నపేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ఏపీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల వ్యవహారంలో వైసీపీ నాయకుల అవినీతిపై నిరసనలు చేస్తున్న టిడిపి నేతలకు దిశానిర్దేశం చేశారు.

తెలుగుదేశం హయాంలో కట్టించిన ఇళ్ళు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదు?
ప్రజల పక్షాన పోరాటం చేయాలని సూచించారు. పేదలకు హౌసింగ్ అంటూనే, ఆయా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న వారి ఇళ్లు కూలుస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టించిన ఇళ్ళు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. టిడిపి హయాంలో కట్టిన ఇల్లు శిథిలావస్థకు చేరుస్తున్నారని మండిపడ్డారు. టిడిపి హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రెండున్నర నుంచి మూడు సెంట్ల వరకు స్థలము ఇచ్చామని, పది లక్షల వరకు ఇళ్ళు కట్టించాము అని పేర్కొన్నారు చంద్రబాబు.

పేదల ఇళ్ల విషయంలోనూ వైసీపీ నేతల కక్కుర్తి
ఇదే సమయంలో కుప్పం హౌసింగ్ బాధితులతో కూడా చంద్రబాబు ఫోన్లో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. వారికి టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతల పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్ల విషయంలోనూ వైసీపీ నేతలు కక్కుర్తి పడుతున్నారని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఇళ్ళ స్థలాల విషయంలో కూడా భారీ కుంభకోణం
ఇళ్ళ స్థలాల విషయంలో కూడా భారీ కుంభకోణం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు టిడిపి హయాంలో నిర్మించిన ఇళ్లను కరోనా సెంటర్లుగా మార్చారని, నివాసానికి అనుకూలంగా, రెడీగా ఉన్న ఇళ్లను శిథిలావస్థకు చేరుస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై జాగ్రత్తలు తీసుకోకుండా రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. నిరుపేద ప్రజలకు అన్యాయం చేస్తే టీడీపీ సహించదని తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications