చంద్రబాబుకు హైకోర్టులో మరో ఊరట-22 వరకూ సీఐడీ నో యాక్షన్ !
ఏపీలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ హైకోర్టులో మరో తాత్కాలిక ఊరట లభించింది. స్కిల్ కేసుతో పాటు మరిన్ని కేసుల్లో సీఐడీ నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబుకు మరో కేసులో ఊరట లభించింది. ఇప్పటికే స్కిల్ కేసులో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తరుణంలో ఆ గడువు ముగిసేలోపు మరో కేసులో అరెస్టు చేయబోమని సీఐడీ ఇవాళ హైకోర్టుకు హామీ ఇచ్చింది.

ఏపీ రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం చేపట్టిన అలైన్ మెంట్ లో మార్పులతో గత టీడీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ, మరికొందరు లబ్ది పొందినట్లు సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ2గా పెట్టింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. సీఐడీ అభిప్రాయం కోరింది.
దీంతో స్పందించిన సీఐడీ.. చంద్రబాబుకు ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆ గడువైన నవంబర్ 22 వరకూ ఆయన్ను అరెస్టు చేయబోమని కోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో ఈ కేసు విచారణను నవంబర్ 22కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత జరిగే విచారణలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా చంద్రబాబు ముందస్తు బెయిల్ పై నిర్ణయం వెలువడనుంది. అప్పటివరకూ చంద్రబాబుకు ఊరట దక్కినట్లే భావించవచ్చు.
వాస్తవానికి చంద్రబాబుపై దాఖలైన స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ లభించినా, ఫైబర్ నెట్ స్కాం, మద్యం, ఇసుక అక్రమాల కేసుల్లో ఆయన్ను 22 వ తేదీ వరకూ అరెస్టు చేయబోమని ఇప్పటికే హైకోర్టుకు సీఐడీ హామీ ఇచ్చింది. ఇప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ అదే వాదన వినిపించింది. దీంతో నవంబర్ 22 వరకూ చంద్రబాబుకు దాదాపు అన్ని కేసుల్లోనూ ఊరట లభించినట్లే భావించవచ్చు.












Click it and Unblock the Notifications