నలుగురు మంత్రులకు చంద్రబాబు బిగ్ టాస్క్..!
ఏపీలో కూటమి అధికారం చేపట్టి 100 రోజులు దాటిపోయింది. అలాగే చంద్రబాబు సీఎంగా 29 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని 30వ పడిలోకి అడుగుపెట్టారు. అయితే ఈ సంబరాలు చేసుకునేలోపు విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో ఎన్నో ఆశలతో అధికారం చేపట్టిన కూటమికి ఆది నుంచే కష్టాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజాగా పలు ప్రాంతాల్లో వచ్చిన వరదల నష్టం అంచనాతో పాటు భవిష్యత్తులో వరదల నియంత్రణపై సూచనలు చేసేందుకు ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో వరదలు, నష్ట పరిహారం అంచనా కోసం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా కన్వీనర్ గా నలుగురు మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. వీరు వరద నష్టం లెక్కింపు, వరద ముంపు నివారణ అంశాలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్నారు. ఇప్పటికే వరద నష్టంపై ప్రాథమిక అంచనాను కేంద్రానికి ప్రభుత్వం పంపింది.

ఇప్పుడు మంత్రుల కమిటీ మరింత లోతుగా వరద నష్టం అంచనా వేయడంతో పాటు భవిష్యత్తులో వరదల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. అలా వరద పరిస్ధితిని ఎప్పటికప్పుడు అంచనా వేసే బాధ్యతను కూడా ఈ కమిటీకి అప్పగించారు. దీంతో ఈ కమిటీలో ఉన్న నలుగురు మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్ ఇచ్చినట్లయింది. ఎందుకంటే రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలపై ఇప్పటివరకూ సాధారణ అంచనాలే ఉన్నాయి. అలాగే కొన్ని దశాబ్దాల క్రితం వరదలు వచ్చిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. వీటిపై అధ్యయనం, సూచనలు చేయడం అంత సులువు కాదు.












Click it and Unblock the Notifications