రాజధాని రైతులకు చంద్రబాబు సర్కార్ ఊరట..! జగన్ నిర్ణయానికి చెక్..!
ఏపీలో రాజధాని అమరావతి రైతులకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయానికి కూటమి సర్కార్ చెక్ పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా పాత నిర్ణయాన్ని రద్దు చేయకపోవడంపై రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజధాని రైతులకు ఊరట దక్కినట్లయింది.
గతంలో వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చింది. దీనిపై ప్రజల్ని ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఇక్కడి ప్రజలు రోడ్డెక్కారు. అమరావతి రాజధాని పేరుతో ఉద్యమాలు చేశారు. ఇదే క్రమంలో అమరావతిలోని సీఆర్డీఏ ఆఫీసు ఎదుట నిరసన చేపట్టారు. దీంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం 44 మంది అమరావతి రైతులపై కేసులు నమోదు చేసింది.

అయితే కూటమి అధికారంలోకి రాగానే ఈ కేసులు ఎత్తేస్తామని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ ఏడాది దాటినా వాటిని వెనక్కి తీసుకోకపోవడంపై రైతులు తాజాగా ప్రభుత్వ పెద్దల్ని కలిసి విన్నవించారు. దీంతో ప్రభుత్వం జగన్ సర్కార్ అప్పట్లో పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కోర్టులో వీటిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం చెప్పబొతోంది. అనంతరం వీటిని రద్దు చేయనున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చాక రాజధానిలో పనులు కూడా చురుగ్గా సాగుతుండటంతో ఉత్సాహంగా ఉన్న రైతులకు ఇది మరో గుడ్ న్యూస్ కానుంది.












Click it and Unblock the Notifications