ఆ వీడియోలే కాపాడాయి: భయం పుట్టాలంటూ శ్రేణులకు చంద్రబాబు పిలుపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసక, రాక్షస పాలన సాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులతో చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. తాను చెప్పింది జరగకపోతే జగమొండి భరించలేరంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు.

ప్రతి ఒక్కరిలో భయం రావాలి..
నామినేషన్ల బలవంతపు ఉపసంహరణపై అన్ని జిల్లాల్లో ఎస్సీలకు, కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మళ్లీ ఇలాంటి తప్పులు చేయాలంటే ప్రతి ఒక్కరిలో భయం రావాలని అన్నారు. కార్యకర్తల దగ్గర ఉన్న సాక్ష్యాదారాలను ఎన్టీఆర్ భవన్కు పంపాలని చంద్రబాబు సూచించారు. ప్రజల స్వేచ్ఛ హరించాలని ఏ చట్టం చెప్పిందని, రాజ్యాంగంలో ఏ నిబంధనా దీనికి అనుమతించదని అన్నారు.

ఆ 30 వీడియోలే ప్రజాస్వామ్యాన్ని బతికించాయి..
రాష్ట్రంలో అనేక చోట్ల వైఎస్సార్సీపీ దుర్మార్గలను ధైర్యంగా ఎదుర్కొన్న వారందరినీ ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. కార్యకర్తలు పంపిన 30 వీడియోలే ప్రజాస్వామ్యాన్ని కాపాడాయన్నారు. అలాంటిది పోలీసులను అడ్డం పెట్టుకుని అప్పుడు తప్పుడు కేసులు పెడతామంటే భయపడతామా? అని అన్నారు. ప్రజాక్షేత్రంలో, న్యాయక్షేత్రంలో అధికార వైసీపిక గుణపాఠం తప్పదని బాబు హెచ్చరించారు.

ఈసీకి కులాన్ని అంటగడతారా?
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమనే సందేశం టీడీపీ నేతలు పంపారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల వీడియోలు, హోర్డింగుల ఫొటోలు, వీడియోలు పంపాలని చంద్రబాబు పార్టీ శ్రేణులను కోరారు. పార్టీ మారేవాళ్లు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. అవకాశవాదులకు టీడీపీలో స్థానం ఉండదని స్పష్టం చేశారు. ఈసీకి కూడా కులం అంటగట్టడం వైసీపీ నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు.
Recommended Video


టీడీపీ వర్సెస్ వైసీపీ
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తమ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ దాడులకు తెగబడుతోందని టీడీపీ ఆరోపిస్తుండగా.. ఓడిపోతామనే భయంతోనే ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రతిపక్షం పార్టీ కుట్రలు పన్నుతోందని అధికార వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications