పవన్ కల్యాణ్కు విరుగుడు: చంద్రబాబు మాస్టర్ ప్లాన్?
హైదరాబాద్: వచ్చే ఎన్నికలనాటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ వైఖరి తీసుకున్నా ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తీసుకునే వైఖరి ఏమిటనేది ఇంకా స్పష్టం కావడం లేదు. అయినా, అవసరమైతే పవన్ కల్యాణ్ను రాజకీయంగా ఎదుర్కోవాలనేదే చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ను కేవలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ తీయడానికే కాకుండా పవన్ కల్యాణ్ రాజకీయాలకు విరుగుడుగా కూడా ప్రయోగిస్తునట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పెద్ద యెత్తున కాపు నాయకులను ప్రోత్సహిస్తూ, కాపు శాసనసభ్యులను పార్టీలోకి తెచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.
2019 నాటికి పూర్తి స్థాయిలో పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు కాపు రిజర్వేషన్లను తెచ్చినా, తేకపోయినా రాజకీయంగా పవన్ కల్యాణ్కు విరుగుడు కనిపెట్టే దిశలోనే చంద్రబాబు పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ బిజెపితో కలిసి నడుస్తారా, ఒంటరిగా ఎన్నికల్లోకి దిగుతారా, టిడిపితో స్నేహాన్ని కొనసాగిస్తారా అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానాలు లేవు. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్లో అరవింద్ కేజ్రీవాల్ లాగా సునామీ సృష్టించడానికి సిద్ధమవుతున్నారా అనేది కూడా తేలడం లేదు.
పవన్ కల్యాణ్ అవసరం లేకుండా వచ్చే ఎన్నికలకు చంద్రబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తన విశేష రాజకీయానుభవం ద్వారా, వచ్చే 22 నెలల కాలంలో ప్రజాకర్షక విధానాలను తీసుకోవడం ద్వారా ఎన్నికలకు సిద్ధం కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో కుమారుడు నారా లోకేష్ కూడా తగిన రాజకీయానుభవాన్ని గడించారని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ ప్రభావం పడకుండా చంద్రబాబు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
పవన్ కల్యాణ్కు బలమైన శక్తి కాపు సామాజిక వర్గమేనని, కాపు సామాజిక వర్గం వెలుపల ఆయనకు పెద్దగా బలం ఉండదని చంద్రబాబు భావిస్తూ ఎక్కువలో ఎక్కువ మంది కాపు నాయకులను పార్టీలోకి తీసుకోవాలనే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.
జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులను పార్టీలోకి తీసుకున్న తర్వాత తుని దాడిశెట్టి రాజాను పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాజాను కూడా పార్టీలోకి తెచ్చే బాధ్యతను చంద్రబాబు నెహ్రూకు అప్పగించినట్లు చెబుతున్నారు.
చంద్రబాబు ఈ వ్యూహం ఫలిస్తే పూర్తి స్థాయి రాజకీయ నేతగా ఆవిర్భవించడానికి పవన్ కల్యాణ్కు పెద్దగా నాయకులు లభించకపోవచ్చునని అంటున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో జయప్రకాష్ నారాయణ సాయం తీసుకోవచ్చునని కూడా అంటున్నారు.