క్యాబినెట్ విస్తరణకు బాబు రెడీ: ఆ ఒక్కరు ఎవరు?, బాలయ్య డౌట్
హైదరాబాద్: ఉగాది పర్వదినం తర్వాత ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. విస్తరణకు ఆయన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నట్లు సమాచారం. ఈ విస్తరణలో 8 మందికి అవకాశం దక్కుతుందని అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి టిడిపిలోకి వచ్చిన 9 మంది శాసనసభ్యుల్లో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆ ఒక్కరు ఎవరనేది తేలడం లేదు. భూమా నాగిరెడ్డికి గానీ ఆయన కూతురు అఖిలప్రియకు గానీ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని పార్టీ నేతలు అంతా డిమాండ్ చేసున్నా చంద్రబాబు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.
ఆపరేషన్ ఆకర్ష్ కోసం లోకేష్ను వాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని అంటున్నారు. అందువల్ల ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదనే మాట కూడా వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను టిడిపిలోకి తీసుకువచ్చే బాధ్యతలను మంత్రులకు అప్పగించి స్వయంగా లోకేష్ ఆ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అది ఫలితాలు ఇస్తోందని అంటున్నారు.
పనితీరు అంత బాగా లేని కొంత మంది మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉందని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కేవారిలో కిమిడి కళా వెంకటరావు, కాలవ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర,మోదుగుల వేణుగోపాల్రెడ్డి, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, బాలకృష్ణ, లోకేష్లను ప్రస్తుతానికి పక్కన పెట్టే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు.
సంధ్యారాణి, పతివాడ నారాయణ స్వామి నాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, గొల్లపల్లి సూర్యారావు, గౌతు శ్యాం సుందర శివాజీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా రేసులో ఉన్నారు. ఒకపుడు వైఎస్ రాజశేఖరరెడ్డిని ధీటుగా ఎదుర్కొన్న కడప జిల్లా నేత సతీష్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కడప జిల్లా రాజకీయాలను మార్చాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని తెలిసింది.
అయితే జంప్ జిలానీల్లో భూమా నాగిరెడ్డి లేదా ఆయన కుమార్తె అఖిలను పక్కన పెట్టి జలీల్ఖాన్ను తీసుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. జ్యోతుల నెహ్రూ పేరును పరిశీలించే పక్షంలో జలీల్ఖాన్ను పక్కన పెడతారని అంటున్నారు. ఈ విస్తరణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వచ్చిన శాసనసభ్యుల్లో ఎవరికీ మంత్రి పదవులు ఇవ్వకూడదనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ పరిణామాలు...
జంప్ జిలానీలను పక్కన పెట్టాలనే ఆలోచన వెనక తెలంగాణలో జరిగిన పరిణామాలు పనిచేస్తున్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్పై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ టిఆర్ఎస్లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు గవర్నర్ను కలిసి , స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశారు.
వైసిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకుంటే ముందు వారితో రాజీనామా చేయించాలనే డిమాండ్ వస్తుందని, దానిని ఎదుర్కొని ఇబ్బందులు పడే బదులు ఈసారి విస్తరణకు దూరంగా ఉండటం మంచిదనే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
గంటా శ్రీనివాసరావు, పీతల సుజాత, కిమిడి మృణాళిని, కింజరాపు అచ్చన్నాయుడు తదితరుల శాఖలు మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
మంత్రి పదవులు ఆశిస్తున్నవారు..
కిమిడి కళా వెంకటరావు, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, మోదుగుల వేణుగోపాల్రెడ్డి, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, సంధ్యారాణి, పతివాడ నారాయణ స్వామి నాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, గొల్లపల్లి సూర్యారావు, గౌతు శ్యాం సుందర శివాజీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో ఉన్నారు.