2050 నాటికి ప్రపంచంలోనే ఏపీ ఉత్తమం: నమ్మకాన్ని వమ్ము చేయనన్న చంద్రబాబు
అమరావతి: 2050 నాటికి ప్రపంచంలోనే ఏపీ ఉత్తమంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం కడపలో రూ.1.5 కోట్లతో హజ్హౌస్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం అలంఖాన్పల్లెలో నిర్వహించిన జన్మభూమి-మాఊరులో బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
మనకున్న వనరులను కష్టాలను సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని సీఎం స్పష్టం చేశారు. కాల్ మనీ కేసులో అత్యంత కఠినంగా వ్యవహారిస్తామని చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తామని పునరుద్ఘాటించారు.
హైదరాబాద్, అమరావతి, తిరుపతికి విమానాలు నడుపుతామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు ప్రతి ఒక్కరినీ ఆందోళనపరిచిందని, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హేతుబద్ధత లేని విభజన చేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. వచ్చే ఏడాదిలోగా గాలేరు-నగరి, హంద్రీనీవా పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. నదుల అనుసంధానం ద్వారా రాయలసీమకు నీరు అందిస్తామన్నారు. ఇబ్బందులున్నా రుణమాఫీ చేశామని, రాష్ట్రంలో మిగులు కరెంట్ సాధించామని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో ప్రజల ఆదాయం పెరగాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని సూచించారు. రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ముస్లిం సోదరులను అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. వక్ఫ్బోర్డు ఆస్తులను కాపాడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆస్పత్రుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు అందజేస్తామని చంద్రబాబు వెల్లడించారు.