రెండు ముక్కలు కాబోతున్న ప్రపంచం? భూమిపై సరికొత్త మహాసముద్రం
మన కాళ్ల కింద ఉన్న భూమి చాలా నిశ్చలంగా, స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ, నిగూఢమైన ఆ ఉపరితలం కింద ఊహకందని మహా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భవిష్యత్తులో మనం చూస్తున్న ప్రపంచ పటం పూర్తిగా మారిపోబోతోంది. అవును.. ఆఫ్రికా ఖండం రెండుగా విడిపోయి, భూగోళంపై సరికొత్త మహాసముద్రం ఆవిర్భవించబోతోందంటూ శాస్త్రవేత్తలు తాజాగా ఒక సంచలన నిజాన్ని బయటపెట్టారు. జాంబియా దేశంలో కొత్తగా గుర్తించిన 'కాఫ్యూ రిఫ్ట్' (Kafue Rift) అనే భూగర్భ భారీ పగుళ్లు.. భూమి గర్భంలో నిశ్శబ్దంగా సాగుతున్న ఈ మహా చీలికకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోందని వెల్లడించారు.
భూకంపాలు కాదు.. వేడి నీటి బుగ్గలే సాక్ష్యాలు!
సాధారణంగా భూమి లోపల వచ్చే మార్పులను లేదా పగుళ్లను భూకంపాల తీవ్రత ద్వారా శాస్త్రవేత్తలు గుర్తిస్తుంటారు. కానీ, ఈసారి పరిశోధకులు అవలంబించిన వినూత్న పద్ధతి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. జాంబియా పరిధిలోని వేడి నీటి బుగ్గలను (Hot Springs) ఆధారంగా చేసుకుని ఈ గుట్టు విప్పారు. ఆ ప్రాంతంలోని నీటి బుడగల్లో నుంచి నిరంతరం వెలువడుతున్న వాయువులను క్షుణ్ణంగా పరీక్షించగా.. అవి భూమి పైపొరల నుంచి కాకుండా, ఊహించని అంత లోతు నుంచి లీక్ అవుతూ ఉపరితలానికి చేరుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

100 మైళ్ల లోతు నుంచి ఉబికివస్తున్న గ్యాస్
ప్రముఖ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైక్ డాలీ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ అత్యంత సంక్లిష్టమైన పరిశోధనను సాగించింది. కాఫ్యూ రిఫ్ట్ పరిధిలోని ఆరు వేడి నీటి బుగ్గలతో పాటు, బయటి ప్రాంతాల్లోని మరో రెండింటి నీటి నమూనాలను వారు సేకరించి పరీక్షించారు. ఈ క్రమంలో రిఫ్ట్ లోపల ఉన్న నీటిలో అత్యంత అరుదైన 'హీలియం ఐసోటోపులు' బయటపడ్డాయి. ఇవి భూమి బాహ్య పొర (Crust) లో తయారయ్యేవి కావు. భూమి ఉపరితలానికి దాదాపు 25 నుంచి 100 మైళ్ల లోతున ఉండే అత్యంత వేడి పొర 'మాంటిల్' (Mantle) నుంచి ఇవి నేరుగా పైకి వస్తున్నట్లు తేలింది. అంటే, భూమిని రెండుగా చీల్చగల భారీ శక్తులు అక్కడ యాక్టివ్గా ఉన్నాయని స్పష్టమైంది.
1,550 మైళ్ల పొడవునా మహా చీలిక!
ఈ భయంకరమైన ప్రక్రియ తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ సిస్టమ్ (East African Rift System) ద్వారా ఇప్పటికే మొదలైందని శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు. టాంజానియా నుంచి నమీబియా వరకు విస్తరించి, సుమారు 1,550 మైళ్ల పొడవున ఉన్న ఈ భూగర్భ పగులు క్రమంగా భూమిని ముక్కలు చేస్తూ సాగుతోంది. ఇదే వేగంతో ఈ చీలిక గనుక కొనసాగితే, సుదూర భవిష్యత్తులో ఆఫ్రికా ఖండం ఖచ్చితంగా రెండు ముక్కలవుతుందని పరిశోధన స్పష్టం చేసింది. ఈ పూర్తి వివరాలను 'ఫ్రాంటియర్స్ ఇన్ ఎర్త్ సైన్స్' అనే అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించారు.
శాపమా? వరమా? జాంబియాకు లక్కీ ఛాన్స్!
ఖండం విడిపోవడం భౌగోళికంగా ఆందోళన కలిగించే విషయమే అయినా.. ఇది ఆఫ్రికా దేశాల ఆర్థిక రాతను మార్చే ఒక అద్భుత వరంగా మారబోతోంది. భూమి లోపలి పొరలు పైకి వస్తుండటం వల్ల ఆ ప్రాంతంలో 'భూగర్భ వేడి' (Geothermal heat) ద్వారా భారీగా స్వచ్ఛమైన విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న హీలియం, హైడ్రోజన్ వంటి అత్యంత విలువైన వనరులు ఇక్కడ లభించబోతున్నాయి. దీంతో జాంబియా ప్రభుత్వం అప్పుడే అక్కడ ఇంధన అన్వేషణను ముమ్మరం చేసింది. ప్రస్తుతం నమీబియా, బోత్స్వానా సరిహద్దుల్లో కూడా ఈ పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications