జైట్లీ వ్యాఖ్యలతో బాధపడ్డ బాబు, మోడీకి జపాన్ తరహా నిరసన
విజయవాడ: ఏపీకి ప్రత్యేక విషయమై లోకసభలో కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడిపి ఎంపీలకు సూచించారని తెలుస్తోంది. అంతేకాదు, సభతో బాటు రాష్ట్రంలోను వినూత్నంగా నిరసన చేపట్టాలని టిడిపి యోచిస్తోంది. జపాన్ తరహాలో నిరసనలకు సిద్ధమవుతోంది.
ఏపీకి హోదా, విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్రం వైఖరిపై చంద్రబాబు, టిడిపి తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. టిడిపి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతోంది. రాజ్యసభలో చర్చ ముగిసినందున హోదా అంశాన్ని లోకసభలో లేవనెత్తాలని, ఇతర రూపాల్లో అసంతృప్తి తెలియచేయాలని నిర్ణయించారు.
జపాన్ తరహా నిరసనలతో పౌరులకు ఇబ్బంది ఉండదని భావిస్తోంది. ఆ తరహా వినూత్నంగా నిరసనలకు ప్లాన్ చేస్తోంది. చంద్రబాబు అధ్యక్షతన ఆదివారం ఉదయం ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ ఎంపీల సమావేశం జరగుతుంది.
జగన్ బంద్: మోడీ! ఎందుకిలా చేస్తున్నారో.. బాబు, ఎత్తుకుపైఎత్తు
జైట్లీ వ్యాఖ్యలతో బాధపడ్డ బాబు!
కొందరు రాష్ట్ర మంత్రుల్ని, ముఖ్యనేతల్ని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. టిడిపి మిత్రపక్షమైనంత మాత్రాన ఏపీకి హోదా ఇవ్వలేమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో చేసిన ప్రకటన పట్ల చంద్రబాబు ఇప్పటికే అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యసభలో చర్చ సందర్భంగా అంత సమర్థంగా మన వాణిని వినిపించలేకపోయామన్న భావనలో ఉన్న టిడిపి లోకసభను వేదికగా చేసుకుని గట్టిగా నిరసన తెలియజేయాలన్న నిర్ణయానికి వచ్చింది. జపాన్లో మాదిరిగా మరింత ఎక్కువ పనిచేయాలని, రహదారులు ఊడ్చడం, మౌన ప్రదర్శనలు వంటి పద్ధతుల్లో నిరసనలు తెలియజేయాలని భావిస్తోంది.
కేంద్రంపై ఏ మార్గాల్లో ఒత్తిడి తేవాలి? నిరసన కార్యక్రమాలు ఎలా ఉండాలి? అప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఏం చేయాలి? ఇలా వివిధ అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
చంద్రబాబు శనివారం నాడు కేంద్రం వైఖరి పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, ప్రజా చైతన్యం ద్వారానే మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోగలమని చెప్పారు. కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.