కేంద్రం నిండా ముంచింది, పవన్-జగన్ ఎందుకు రాలేదు: బాబు, మోడీకి వార్నింగ్!
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో విభజన హామీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. కేంద్రం తీరుతో ఏపీ ప్రజలు విసిగిపోయారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ఏపీని కేంద్రం నిండా ముంచింది అన్నారు.
చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. విభజన హామీల అమలుకు పదేళ్ల సమయం ఉందని బీజేపీ చెబుతోందని, అయినప్పటికీ చాలా వరకు తాము ముందే ఇచ్చామని చెప్పాయని ఓ విలేకరి ప్రశ్నించారు. దానికి చంద్రబాబు మాట్లాడుతూ.. విభజన చట్టం అమలును ఎందుకు సమీక్షించరని, హోదా ఏమయిందని, ఇంతవరకు ఇవ్వలేదన్నారు.
Recommended Video


దక్షిణాది గళంపై
దక్షిణాది రాష్ట్రాల నేతలు ఈ మధ్య గళమెత్తుతున్నారని, ఈ రాష్ట్రాలు ఏకతాటిపైకి వస్తారా అని మరో విలేకరి అడగ్గా.. అది మరో సమస్య అని చంద్రబాబు చెప్పారు. కేంద్రంపై తాము అవిశ్వాస తీర్మానం ఇస్తే తమకు చాలా పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. తనకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. తమిళనాడు గురించి ఓ ప్రశ్న ఎదురుకాగా.. తమిళనాడు ప్రభుత్వంతో, ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు.

రాజకీయాల కోసం రాలేదు
ఇక్కడకు తాను రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదని, ఏపీకి న్యాయం చేసేందుకు వచ్చానని చంద్రబాబు చెప్పారు. తనకు ఏపీ ప్రయోజనాలు ముఖ్యమని తెలిపారు. ఏపీకి కేంద్రం న్యాయం చేయాలన్నారు. నదుల అనుసంధానం చాలా ఏళ్లుగా పెండింగులో ఉందని చెప్పారు. తాము ఏపీలో అనుసంధానం చేశామన్నారు. కేంద్రం వైఖరిపై తాము పోరాడుతున్నామని చెప్పారు.

రాజకీయ లబ్ధి కోసం కేంద్రం సమస్యలు సృష్టించొద్దు
రాజకీయ లబ్ధి కోసం కేంద్రం సమస్యలను సృష్టించరాదని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రాల సమస్యలపై కేంద్రం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చంద్రబాబు గతంలో పలుమార్లు చెప్పారని బీజేపీ అంటోంది కదా అని ప్రశ్నించగా... హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెబితే అంగీకరించామన్నారు. జాయింట్ పార్లమెంటు కమిటీ వేసి విభజన హామీలపై సమీక్ష నిర్వహించాలన్నారు. చట్టంలో ఉన్నవి, ప్రధాని ఇచ్చిన హామీలనే చేయాలని కోరుతున్నామని తెలిపారు.

సెంటిమెంట్ ఆధారంగా నిర్ణయాలు
సెంటిమెంట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోమని బీజేపీ పదేపదే చెబుతోందని ఓ విలేకరి ప్రశ్నించగా.. ఏపీలో బీజేపీ రాజకీయం చేస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాము ఎన్డీయే నుంచి బయటకు రావడంతో బీజేపీ వైసీపీ వైపు చూస్తోందన్నారు.

జగన్, చంద్రబాబు కలిసి
మరో విలేకరి మాట్లాడుతూ.. చంద్రబాబు, జగన్లు ఇరువురు హోదా కోసం పోరాడుతున్నారని మరి ఇందులో తేడా ఏముందని, అలాగే జగన్, మీరు కలిసి ఉద్యమించే ఆస్కారం ఉందా అని అడిగారు. దానికి చంద్రబాబు మాట్లాడుతూ.. కొందరు ప్రజలను మానిప్యులేట్ చేస్తున్నారని చెప్పారు. ఏపీ కోసం టీడీపీ చిత్తశుద్దితో పోరాడుతోందన్నారు. విభజన సమయంలోను రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని తాను అడిగానని చెప్పారు. ఏపీ కోసం అఖిల పక్ష సమావేశం పెడితే వైసీపీ, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన రాలేదన్నారు.

కొన్ని పార్టీలు గేమ్
హైదరాబాద్ను అభివృద్ధి చేశారు, ఇప్పుడు మరో రాజధాని (అమరావతి)ని అభివృద్ధి చేస్తున్నారని, ఎలా భావిస్తున్నారని కొందరు అడిగారని, తాను తెలుగు ప్రజల కోసం హైదరాబాద్ను అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పారు. ఏపీ అభివృద్ధి కోసం తాను కష్టపడుతున్నానని చెప్పారు. కరుణానిధి, జయలలితల ప్రశ్నలకు కూడా ఆయన స్పందించారు. తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందన్నారు. తాము కేంద్రంతో ఫైట్ చేస్తున్నామని, కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు. తాను టీడీపీ అధ్యక్షుడిగా చెప్పడం లేదని, ఏపీ సీఎంగా చెబుతున్నానని తమ ఉద్యమానికి అందరి మద్దతు కావాలన్నారు. కొందరికి వేరే ఉద్దేశ్యాలు ఉన్నాయని, అది ఏపీకి మంచిది కాదన్నారు. విభజన హామీలపై జాయింట్ పార్లమెంటు కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications