జగన్! నా మీద కోపం వారిమీద చూపిస్తావా?: చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: ప్రస్తుత ఏపీ సర్కారు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వుల్ని రద్దు చేయడంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద కోపం ఉంటే రైతుల మీద ఎందుకు చూపిస్తున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.
రుణమాఫీ రద్దు చేస్తూ..
కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులను జగన్ సర్కారు తాజాగా రద్దు చేసింది. ఈ ఏడాది మార్చి 10న చేసిన జీవో 38ని రద్దు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 4,5 విడతల్లో ఇవ్వాల్సిన రుణ మాఫీ నిధులు రూ. 7,959.12 కోట్లు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
విమర్శలకు తావిచ్చిన నిర్ణయం..
అయితే, చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిన ఈ రుణమాఫీ జీవోను రద్దు చేస్తూ జగన్ సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిచ్చింది. వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ తాజా ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కారు.
ఇది మోసం కాదా?
‘2014కు ముందు రైతురుణమాఫీ అసాధ్యమన్న వ్యక్తి, ఈరోజు రైతు రుణమాఫీ 4, 5 విడతల సొమ్ము రూ.7985 కోట్లను ఎగ్గొట్టారు. ఒక్కో రైతుకు ఏడాదికి రూ 12500 ఇస్తానని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు అందులో సగం ఎగ్గొట్టడం రైతు భరోసా ఎలా అవుతుంది? రైతులను మోసగించడం అవుతుంది' అని చంద్రబాబు ఆరోపించారు.
ఇలా చేయడం దుర్మార్గం..
‘నా మీద కక్ష సాధించాలని రైతులను క్షోభపెట్టే మరో ఘోర తప్పిదం చేసింది ప్రభుత్వం. రైతురుణమాఫీ సొమ్ముకి సంబంధించిన జీవో-38ని రద్దు చేయడం అమానుషం. మీ చేతకానితనం వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇలా చేయడం దుర్మార్గం' అని చంద్రబాబు నాయుడు జగన్ సర్కారుపై ధ్వజమెత్తారు. జగన్ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. కాగా, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణానికి జగన్ సర్కారు వేధింపులే కారణమంటూ చంద్రబాబు ఇటీవల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.