భస్మ ఆరతి వేళ బయటపడ్డ శివలింగం, మహాకాళుని గడ్డపై అద్భుతం..
అవంతికా పురిగా పిలువబడే ఉజ్జయిని క్షేత్రం.. కాలానికే అధిపతి అయిన మహాకాళేశ్వరుడు కొలువైన పరమ పవిత్ర భూమి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రంలో తాజాగా ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. 2028లో జరగనున్న సింహస్థ కుంభమేళా కోసం నిర్వహిస్తున్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా భూమిని చదును చేస్తుండగా, పురాతనమైన శివలింగం వెలుగులోకి వచ్చింది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన 'భస్మ ఆరతి' జరుగుతున్న సమయంలోనే ఈ శివలింగం బయటపడటం భక్తులను పరవశింపజేస్తోంది.
శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆలయ ప్రీపెయిడ్ బూత్ సమీపంలో భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతుండగా ఈ శివలింగం కనిపించింది. సరిగ్గా అదే సమయంలో ఆలయంలో స్వామివారికి భస్మ ఆరతి నిర్వహిస్తున్నారు. ఈ అసాధారణ ఆవిష్కరణ గురించి తెలియగానే యంత్ర ఆపరేటర్ నరేష్ ప్రజాపతి వెంటనే పనులు నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. "తవ్వకాలు జరుగుతుండగా భస్మ ఆరతి వేళ శివలింగం బయటపడటం ఎంతో శుభకరం" అని ఆలయ ప్రధాన అర్చకులు ఆకాష్ శర్మ పేర్కొన్నారు. ఈ వార్త దావాగ్నిలా వ్యాపించడంతో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని, శివలింగానికి పూజలు చేసి జలాభిషేకం నిర్వహించారు.

నిలిచిపోయిన పనులు.. పురావస్తు శాఖ దర్యాప్తు
ఈ పరిణామంతో అధికారులు ఆ ప్రాంతంలో పనులను తాత్కాలికంగా నిలిపివేసి, శివలింగాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. "ప్రస్తుతానికి పనులను నిలిపివేశాం. భవిష్యత్తులో మరిన్ని కళాఖండాలు దొరికితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని ఆలయ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ అశీష్ ఫల్వాడియా తెలిపారు. పురావస్తు శాఖ అధికారులు ఈ శివలింగంపై అధికారిక దర్యాప్తు నిర్వహించి, దాని ప్రాచీనత, చారిత్రక ప్రాముఖ్యతను అంచనా వేయనున్నారు. ఇప్పటికే ఈ క్షేత్రం అత్యంత పురాతనమైనది కావడంతో, భూ గర్భంలో మరిన్ని చారిత్రక ఆధారాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
#WATCH | Ujjain, Madhya Pradesh: During the ongoing construction for Simhastha 2028, a large Shivalinga was discovered while excavating near the Mahakaleshwar Temple complex in Ujjain
— ANI (@ANI) May 1, 2026
The discovery was made while heavy machinery was clearing land for the temple's expansion… pic.twitter.com/1avcIJGPnD
సింహస్థ కుంభమేళా 2028 కోసం ఏర్పాట్లు
ఉజ్జయినిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సింహస్థ కుంభమేళా 2028 మార్చి 27 నుండి మే 27 వరకు జరగనుంది. ఈ మహోత్సవం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే భారీ బడ్జెట్ను కేటాయించింది. సుమారు రూ. 2,923.84 కోట్లతో రోడ్లు, హోమ్స్టేలు, పార్కింగ్ వంటి 22 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టింది. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగానే ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తాజా ఆవిష్కరణ మహాకాళేశ్వర్ ఆలయ ప్రాశస్త్యాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచుతుందని భక్తులు గట్టిగా విశ్వసిస్తున్నారు.














Click it and Unblock the Notifications