దక్షిణ కొరియాలో చంద్రబాబు, పెట్టుబడులే లక్ష్యంగా, ఏమేం చేయబోతున్నారంటే...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన తన మూడు రోజుల పర్యటనలో పలు సంస్థలను సందర్శించనున్నారు.
ఈ పర్యటనలో చంద్రబాబు వివిధ సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకోవడంతోపాటు ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా బాబు సోమవారం కియా మోటార్స్ సందర్శించి అక్కడ జరిగే బిజినెస్ సెమినార్లోనూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ పెట్టుబడులకు తమ రాష్ట్రం ఎంతో అనుకూలమైనదని హాజరైన ప్రతినిధులకు తెలిపారు. బ్యూసన్ సిటీలోని ప్యూజన్ న్యూపోర్ట్ కంపెనీ, మేకిన్ ఇండియా సెంటర్, నాక్స్ అండ్ నేషనల్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ను కూడా సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు.
మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు...
కొరియా కార్ల దిగ్గజం కియా, దాని అనుబంధ సంస్థలు కలిపి రూ.13,500 కోట్ల పెట్టుబడులతో అనంతపురం జిల్లాలో అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ మొబైల్ ప్రాజెక్టులు నెలకొల్పుతున్నాయి. ఈ స్పూర్తితో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు దక్షిణకొరియాలో పర్యటిస్తున్నారు.
కియా మోటార్స్, దాని 17 అనుబంధ సంస్థలతో...
17 కియా అనుంబంధ సంస్థల ప్రతినిధులతో పాటు మరో 25 టూ టైర్, త్రీ టైర్ అనుబంధ సంస్థల ప్రతినిధులతోనూ చంద్రబాబు భేటీ అవుతారు. కియా మోటార్స్, దాని 17 అనుబంధ సంస్థలతో ఏపీఐఐసీ, ఈడీబీ మధ్య అవగాహనా ఒప్పందం కుదరనుంది. ఎస్సెర్స్ గ్రూప్తో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు.
వరల్డ్ క్లాస్ స్మార్ట్ ఇండస్ట్రీయల్ సిటీ కోసం...
అనంతపురంలో వరల్డ్ క్లాస్ స్మార్ట్ ఇండస్ట్రీయల్ సిటీ ఏర్పాటుపై ఎస్సెర్స్ గ్రూప్తో ఏపీ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇండస్ట్రియల్ పార్క్, లాజిస్టిక్ పార్క్, వేర్ హౌసింగ్, కమర్షియల్ స్పేస్ హౌసింగ్, గోల్ఫ్ కోర్స్ ఇందులో భాగంగా ఉంటాయి. ఈ ఎంవోయూలో 29 కంపెనీలు భాగస్వామ్యం అవుతాయి.
బ్యూసన్ తరహా ఇండస్ట్రియల్ సిటీ...
బ్యూసన్, ఏపీఐఐసీ మధ్య మరో ఎంవోయూ జరిగే అవకాశం ఉంది. ఏపీలో అన్ని అనుకూలతలు ఉన్న ఓ ప్రాంతంలో కొరియన్ సిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న సీఎం చంద్రబాబు అందులో బ్యూసన్ తరహా ఇండస్ట్రియల్ సిటీ నెలకొల్పే ఆలోచనలో ఉన్నారు. మంగళ, బుధవారాల్లో సీఎం చంద్రబాబు అక్కడ జరిగే రెండు రోడ్ షోల్లోనూ పాల్గొంటారు.
పలు సంస్థల అధిపతులతో....
డిసెంబర్ 6న కియా మోటర్స్తో కలిసి మరో బిజినెస్ సెమినార్కు హాజరవుతారు. ఈ పర్యటనలోనే కియో మోటర్స్ హెడ్క్వార్టర్స్ను సందర్శించి ఆ సంస్థ వైస్ చైర్మన్తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఆ తరువాత లొట్టె కార్పొరేషన్ ప్రెసిడెంట్తో సమావేశం అవుతారు. కొకం కంపెనీ లిమిటెడ్ సీఈవోతో, ఓసీఐ కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్తోనూ, ఎంగ్వన్ కంపెనీ చైర్మన్తో అలాగే కొరియా ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియోషన్ మేనేజింగ్ డైరెక్టర్తోనూ చంద్రబాబు సమావేశమవుతారు.
తొలిరోజు పలువురు ప్రతినిధులతో భేటీ...
దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్లిన ఆయన తొలిరోజు పలువురు ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ను రెండో రాజధానిగా చేసుకుని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
రెండంకెల వృద్ధి రేటు భారత్కే సాధ్యం...
అనేక అవరోధాలు, ప్రతికూలతలను అధిగమించి దక్షిణకొరియా అభివృద్ధి సాధించిన తీరు స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు. భౌగోళికంగా, జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్, దక్షిణకొరియా మధ్యనున్న సారూప్యతలను వివరించారు. ప్రపంచంలో భారత్ ఒక్కదానికే రెండంకెల వృద్ధిరేటు సాధించగల సామర్థ్యం ఉందన్నారు. గత మూడేళ్లుగా ఏపీ సుస్థిరంగా రెండంకెల వృద్ధి సాధిస్తోందని తెలిపారు. వచ్చే 15 ఏళ్ల పాటు 15 శాతం వృద్ధి నమోదు చేయాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
కియా ప్రతినిధుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్...
తొలుత కియా అనుబంధ సంస్థల ప్రతినిధులతో జరిగిన భేటీలో ఆ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లో తాము పెట్టబోయే పెట్టుబడుల ప్రణాళికపై చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాంతాల్లో ఎంతమేర పెట్టుబడులు పెట్టేది వివరించారు. తాము ఏర్పాటు చేసే సంస్థల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయో వెల్లడించారు.