ముఖ్యమంత్రి ఉన్నారా: టెక్కీ రేప్పై చంద్రబాబు ప్రశ్న
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అపహరణ, అత్యాచారం ఘటనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఢిల్లీలో నిర్భయ, హైదరాబాదులో అభయ అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ సంఘనపై ముఖ్యమంత్రి స్పందించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ముఖ్యమంత్రి ఉన్నారా అని ఆయన అడిగారు. తమ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయని ఆయన అన్నారు.
సైబరాబాద్ అనే మూడో నగరాన్ని నిర్మించింది తామేనని ఆయన చెప్పుకున్నారు. అంతకు ముందు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు మాత్రమే ఉండేవని ఆయన చెప్పారు. అటువంటి సైబరాబాద్లో భద్రత లేకుండా పోయిందని ఆయన అన్నారు. జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే బాధ, కోపం, ఆవేశం కలుగుతున్నాయని ఆయన అన్నారు. అంత సంఘటన జరిగితే ముఖ్యమంత్రి ఉన్నాడా, ఏమయ్యాడు అని అడిగారు. అభయ సంఘటనపై స్పందించాల్సిన అవసరం ముఖ్యమంత్రికి లేదా అని ఆయన ప్రశ్నించారు.

తాము తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని ఆయన చెప్పుకున్నారు. ప్రజల వద్దకు పాలన, శ్రమదావం వంటి ద్వారా ప్రజలను భాగస్వాములను చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎవరికి దొరికినంత వారు దోచుకున్నారని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కాంగ్రెసు లాలూచీ పడిందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను అదుపు చేయలేకపోయాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications