ఏపీ ప్రభుత్వానికి మాయని మచ్చగా ఆ ఘటన మిగిలింది: చంద్రబాబు
అమరావతి: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చిన్నారిని ఎలుకలు కొరుక్కు తినడంతో మృతి చెందిన ఘటన ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని గేట్ వే హోటల్లో కలెక్టర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శల సదస్సులో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.
విజయావాడకు చెందిన నాగరాజు, లక్ష్మీ దంపతులు చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన చిన్నారిని ఎలుకలు కొరుక్కు తినడంతో ఆ పసికందు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఆగస్టు నెలలో జరిగింది.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విద్య, వైద్యం, బీసీ సంక్షేమశాఖల పనితీరుపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా వైద్య సిబ్బంది మాత్రం విధుల్లోకి రావడం లేదన్నారు.
ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రుల పనితీరు అద్వాన్నంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల, టీచర్ల నిష్పత్తిలో మనం మెరుగ్గా ఉన్నా ఫలితాల్లో వెనుకబడ్డామని చెప్పారు. స్త్రీ, శిశుసంక్షేమం, వైద్యం, విద్యాశాఖల్లో ప్రక్షాళన జరగాల్సిందేనని స్పష్టం చేశారు.

ఏపీలో రెవెన్యూ శాఖ అధికారులు మారాల్సి ఉందన్నారు. అధికారులు, ఉద్యోగులు పారదర్శకంగా పని చేస్తూ, లంచాలకు దూరంగా ఉండి, ప్రజలకు దగ్గర కావాలన్నారు. రెవెన్యూ శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో రాష్టం రెండంకెల వృద్ధిని సాధించాలని తాను కోరుతుంటే కొన్ని ప్రభుత్వ శాఖలు అవినీతిలో రెండంకెల వృద్ధిన్నారు.
ముఖ్యంగా రెవెన్యూ శాఖపై ఉన్న అవినీతి ముద్ర తొలగించుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ అవినీతి ముద్రను వదిలించుకోవాలని, ఈ శాఖలో అవినీతి అలాగే ఉందన్నారు. అవినీతి కంటే అసమర్థతే చాలా ప్రమాదం అన్నారు. ఇసుక మాఫియాపై కూడా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంతో పోటీపడి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కలెక్టర్లు, అధికారులు కొత్త ఆలోచనలతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు నారాయణ, పరిటాల సునీత, అచ్చెన్నాయుడు, మాణిక్యాలరావు, కామినేని, యనమలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు హాజరయ్యారు.
Glimpses from the ongoing Collector's Conference at Vijayawada. pic.twitter.com/WHAWCl9xqU
— Andhra Pradesh CM (@AndhraPradeshCM) September 18, 2015 











Click it and Unblock the Notifications