ఏపికి చైనా ‘పవర్’, రాజధానికి హెల్ప్: చంద్రబాబు
బీజింగ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనాలో శుక్రవారం చివరి రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. పలు కంపెనీలతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. టిసిఎల్, ట్రినా సోలార్, జేఏ సోలార్ కన్స్ట్రక్చన్ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడారు. ఏపిలో యూనిటి్ ప్రారంభానికి ఎలక్ట్రానిక్ కంపెనీలు అంగీకారం తెలిపాయి.
మేనెలలో ప్రధాని సమక్షంలో ఎంఓయూకు సోలార్ పవర్, ట్రినా కంపెనీల అంగీకారం తెలిపాయి. ఏపిలో 500మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటుకు జేఏ కంపెనీ ముందుకొచ్చింది.ఆ తర్వాత జియాన్ లోంగి సిలికాన్ మెటీరియల్ కార్పొరేషన్తో చంద్రబాబు భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సహకరించాలని చంద్రబాబు పారిశ్రామిక వేత్తలను కోరారు.చైనాలో ప్రముఖ నిర్మాణాలను చేపట్టిన జెపిసి మేలో ఏపికి వచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఏపీ కేంద్రంగా అంతర్జాతీయ కార్యకలాపాలకు సాగించాలని ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొంది.
చంద్రబాబు గురువారం కూడా పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపి పరిశ్రమల స్ధాపనకు పూర్తిగా అనుకూలమైన ప్రాంతమని, పారిశ్రామిక ప్రశాంతతకు చిరునామా అని, కార్మికులు, ఇంజనీర్లు అంకితభావంతో పనిచేస్తారని, అశాంతికి తావులేదని అన్నారు. ఆంధ్రలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమని, అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పించేందుకు తానే బాధ్యత వహిస్తానని ఆయన చెప్పారు.
చైనా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక డెస్కును ఏర్పాటు చేస్తానన్నారు. గురువారం ఆయన చైనాలోని చెంగ్డు నగరంలో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్భ్రావృద్ధికి రూపొందించిన బ్లూప్రింట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరస్పర సహకారం చైనా భారత్లకు లాభదాయకమన్నారు. ఏపిని విజ్ఞాన భాండాగారంగా మార్చడం, పేదరికం నిర్మూలన తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 150 ఏళ్లనాటి సాగునీటి ప్రాజెక్టులున్నాయన్నారు.
పరిశ్రమలకు తక్షణమే అనుమతులు, నిరంతర విద్యుత్, పుష్కలమైన భూమి, నీటి వనరులు సానుకూలమైన అంశాలన్నారు. తమ రాష్ట్రంలో భారీ భూమి బ్యాంకు ఉందని, భూ కేటాయింపుల్లో ఎటువంటి సమస్యలు ఉండవన్నారు. ఆంధ్ర రాష్ట్ర నూతన రాజధాని అమరావతికి సింగపూర్ సహకారాన్ని వివరించారు. అమరావతిని చైనా రెండవ మజిలీగా చేసుకోవాలని, అలాగే చెంగ్డును ఆంధ్రులు రెండవ మజిలీగా చేసుకుంటారన్నారు.