పారిశ్రామిక కారిడార్గా దొనకొండ: చంద్రబాబు
హైదరాబాద్: దొనకొండను పారిశ్రామిక కారిడార్గా చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నాగులపాలెంలో జరిగిన గ్రామ సభలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.
ప్రధానమైన విద్య, వైద్య సంస్థలు, పరిశ్రమలను ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ ఆధార పరిశ్రమలను ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి దొనకొండ ప్రాంతంలో కారిడార్ను ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఒంగోలులో వెటర్నరీ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న ఒంగోలు జాతి గిత్తల అభివృద్ధి, అత్యంత రుచికరమైన పాలు ఈ ప్రాంతంలో దొరుకుతున్నందువల్ల పాడి పరిశ్రమ అభివృద్ధి, గొర్రెలు, ఇతర పశుసంపతి అభివృద్ధి కోసం వెటర్నరీ యూనివర్సిటీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
జిల్లాలో అత్యంత కీలకమైన వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరలో పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. రైతులు, పేదలు తమ ప్రభుత్వానికి రెండు కళ్ళు వంటి వారని, వారి బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పని చేస్తుందన్నారు.
రైతులకు గౌరవం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తామని, అదే సమయంలో పేద వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా పేదరిక నిర్మూలన కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ పై ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. అర్హతగల ఏ ఒక్క రైతూ అప్పులు కట్టాల్సిన అవసరం లేదని, అవసరమైతే తాను బయట నుంచి అప్పులు తెచ్చి అయినా రైతు రుణాలు తీర్చుతానన్నారు.
రైతు సాధికారిక మిషన్ ఏర్పాటు చేసి అందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుం దన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలంటే భూసారం తెలుసుకొని దానికి అనుగుణంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చేలా చేసుకోవాలన్నారు. అందుకోసం రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.
తాను డ్వాక్రా రుణాలు రద్దు ప్రకటించిన అనంతరం చాలామంది మహిళలు రుణాలు చెల్లింపు నిలిపివేశారని, అలాంటి వారిని ప్రస్తుతం వడ్డీ చెల్లించాలని బ్యాంకర్లు కోరుతున్నట్లు తెలిసిందని, అయినా, ఎవరు వడ్డీని చెల్లించవద్దని, ప్రభుత్వమే దానిని కూడా చెల్లిస్తుందన్నారు. ప్రతి డ్వాక్రా సభ్యురాలికీ రూ.10వేలు ఇస్తామన్నారు. గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు అనేక రకాల వస్తువులను ఉత్పత్తులను చేసి మార్కెటింగ్ చేసుకొని ఆదాయం పొందారని, ఇప్పుడు అలాంటి ప్రొత్సాహాన్నిస్తుందన్నారు.
ఇంటర్నెట్ మార్కెటింగ్ ద్వారా డ్వాక్రా ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొనే స్థాయికి గ్రామీణ డ్వాక్రా గ్రూపు మహిళలు ఎదగాలన్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో సాధారణ ప్రజానీకం కూడా భాగస్వామ్యులు కావాలన్నారు. రానున్న ఏడాది కాలంలో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications