రేపు జపాన్ ప్రధాని షింజో అబేతో బాబు భేటీ, సంచులు మోసేవారే: రోజా
హైదరాబాద్: జపాన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం కుబోటా కార్పోరేషన్తో చర్చలు జరిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు సహాయపడే ఉత్పత్తులను ఈ కార్పోరేషన్ తయారు చేస్తోంది. ఈ సందర్భంగా కుబోటా ప్రతినిధులు తమ ఉత్పత్తులను సీఎం చంద్రబాబు నాయుడుకి వివరించారు. దీంతో ఎరువుల వాడకం తగ్గించేలా మార్పు తీసుకొస్తున్నామని చంద్రబాబు వారికి వెల్లడించారు.
వ్యవసాయంలో నూతన పద్ధతులకు తాము ప్రాధాన్యమిస్తున్నామని.... ఏపీ రైతుల నైపుణ్యం పెంచేందుకు జపాన్ సాయం కోరతామని చంద్రబాబు వారికి తెలిపారు. అనంతరం ఇసుజ, మయేవకా, జైకా ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, వనరులకు సంబంధించి చంద్రబాబు పవర్పాయింట్ ప్రజెంటేషన్ను ఇచ్చారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా జైకా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ర్టీయల్ పార్క్ స్పెషల్ అథారిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని జైకా ప్రతినిధులు చంద్రబాబుకు చెప్పారు. ఫికప్ ట్రక్స్ తయారీ సంస్థ ఏర్పాటుకు శ్రీసిటీ సెజ్ అనుకూలమైందని ఇసుజ ఉపాధ్యక్షుడు అన్నారు. శుక్రవారం జపాన్ ప్రధాని షింజో అబేతో చంద్రబాబు భేటీ కానున్నారు.
చంద్రబాబు వెంట వెళ్తున్న వారిలో విషయపరిజ్ఞానం లేదు: రోజా
ఏపీ సీఎం చంద్రబాబు వెంట విదేశీ పర్యటనలకు వెళ్తున్న వారికి విషయపరిజ్ఞానం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రానికి నిధులు తీసుకొస్తామంటూ వెళ్లిన వారిలో సారా వ్యాపారం, మనీ ల్యాండరింగ్, విద్యా వ్యాపారం, సంచులు మోసే వారున్నారు తప్ప, పెట్టుబడులను రప్పించేందుకు అవసరమైన పరిజ్ఞానం ఉన్నవారు లేరన్నారు.
అధికారంలోకి వస్తే రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బాబు, ఇచ్చిన మాట నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు. బాబులా ప్రజలకు అబద్దపు హామీలు ఇచ్చి ఉంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు మారారని ప్రజలు అనుకున్నారని, ఐతే గతంలో కంటే ఎక్కువ మోసగానిగా మారారని ఆమె విమర్శించారు. బాబు చేతకానితనం వల్లే రాష్ట్రం విడిపోవాలన్న ఆలోచన వచ్చిందని రోజా దుయ్యబట్టారు.