ప్రజలకు చంద్రబాబు బహిరంగలేఖ: జగన్ పాలనలో దారుణాలు ఏకరువు పెడుతూ ఉద్వేగంగా సుదీర్ఘలేఖ!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. భారత రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు రాష్ట్రంలో తాజా పరిస్థితులను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, సమన్యాయం అందించి ఉన్నత లక్ష్యాలతో రాజ్యాంగం రూపొందించబడినదని పేర్కొన్న చంద్రబాబు ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ రూపకర్త ఆశయాలకు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు.
జగన్ రెడ్డి లాంటి చెడ్డ పాలకులను ఉద్దేశించే అంబేద్కర్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రజలకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ లేఖలో చంద్రబాబు రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే పాలకుడు చెడ్డవాడు అయితే అది చెడు ఫలితాలను ఇస్తుందని, రాజ్యాంగం ఎంత చెడ్డదైనా అమలు చేసే పాలకుడు మంచివాడు అయితే అది మంచి ఫలితాలను ఇస్తుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు. అంబేద్కర్ నాడు చేసిన వ్యాఖ్యలు జగన్ రెడ్డి లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తులో వస్తారని ముందే ఊహించి చెప్పి ఉంటారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ టెర్రరిజం తో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పాలన జరుగుతోందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామని తాము ఏం చేసినా చెల్లుతుందనే అహంకారంతో వ్యవహరిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలు పాటించడం లేదని రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కుతూ ప్రజల హక్కులు, స్వేచ్ఛను హరిస్తున్నారని చంద్రబాబు ఈ లేఖలో నిప్పులు చెరిగారు.
ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ పోకడలతో జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, ప్రభుత్వ టెర్రరిజం తో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన కొనసాగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించినా, పాలకులు, పాలన ని విమర్శించినా ప్రజలు రాజకీయ పార్టీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
హక్కులు హరిస్తున్న సర్కార్.. వ్యవస్థలపై దాడులు
ప్రజల సమస్యలపై రాజకీయపక్షాలు నిరసనలు తెలిపే హక్కు కూడా లేదన్నట్టు అక్రమ కేసులు పెడుతున్న తీరును చంద్రబాబు తప్పుబట్టారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలియ చేసే హక్కును కూడా హరిస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది కళంకిత అధికారులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్న చంద్రబాబు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ తాము ప్రజలకు జవాబుదారీ అనే విషయాన్ని మరిచిపోతున్నారు అని మండిపడ్డారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించవలసిన చట్టసభలను దూషణలకు, అసత్యాలకు వేదికగా మార్చారని, చట్టసభల గౌరవాన్ని తగ్గించారని ప్రతిపక్షాలనే కాకుండా, మీడియా, న్యాయ వ్యవస్థ పైన దాడికి దిగుతున్నారు అని చంద్రబాబు మండిపడ్డారు.
రాష్ట్రంలో జరిగిన దారుణ ఘటనలను ఏకరువు పెట్టిన చంద్రబాబు
న్యాయమూర్తుల పై ఆరోపణలు చేసే స్థితికి వైసిపి నాయకులు దిగజారారని అలాంటి వారిని వైసిపి ప్రభుత్వ పెద్దలే రక్షించి ప్రోత్సహించే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. మీడియాను సైతం చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు రాజ ద్రోహం వంటి కేసులు పెడుతున్నారని, మీడియా ఛానళ్ల ప్రసారాలను నిలిపి వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని, శిరోముండనాలు, హత్యాయత్నాలు, అక్రమ కేసులు నాటి నాజీ పాలనను గుర్తు చేస్తున్నాయని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.
మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ను నర్సీపట్నంలో ఎలా హింసించి చంపేశారో.. న్యాయం అడిగినందుకు అబ్దుల్ సలాం ను నంద్యాల లో ఎలా బలి తీసుకున్నారో.. తమను ప్రశ్నించిన సొంత పార్టీ లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు అక్రమ కేసులతో కస్టడీలో ఎంత చిత్రహింసలకు గురి చేశారో అందరూ చూశారని చంద్రబాబు పేర్కొన్నారు.
330కిపైగా కేసులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు
42 నెలలలో ప్రభుత్వ విధానాలకు సంబంధించి దాదాపు 330కిపైగా కేసులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావడం ప్రజావ్యతిరేక పాలనకు అద్దం పడుతోందని చంద్రబాబు వెల్లడించారు. వందల సంఖ్యలో కోర్టు ధిక్కార పిటిషన్ లు గాడితప్పిన పాలనకు అద్దం పడుతున్నాయి అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా పలువురు అధికారులు కోర్టు బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాలేదని చంద్రబాబు తెలిపారు.
రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఇది అత్యంత ప్రమాదకరమని, గొడ్డలిపెట్టు అని చంద్రబాబు పేర్కొన్నారు, ఇలా అన్ని వ్యవస్థలను ప్రభుత్వం నాశనం చేస్తోందని పేర్కొన్న చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ప్రశ్నించారు.
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి? ప్రజలకు పోరాటం చెయ్యాలని చంద్రబాబు పిలుపు
ఒకప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో దేశంలోనే ముందు ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయిందని, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి? అని అందరూ ఆలోచన చేయాలన్నారు. రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా తాము చెప్పిందే రాజ్యాంగం అన్న గర్వంతో విర్రవీగుతూ ఉన్న వైసిపి నేతలను ప్రజాక్షేత్రంలో శిక్షించి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
లేకపోతే వైసీపీ శ్రేణుల అకృత్యాలు మీ ఇంటిని చుట్టుముడతాయి అని, దుర్మార్గులు మీ ప్రాణాలకు ముప్పు తీసుకువస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక పాలన పై పోరాటంలో ప్రజలందరూ రాజ్యాంగ విలువలు కాపాడుకోవాలని చంద్రబాబు తెలిపారు. లేకుంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది అన్నారు. రాజ్యాంగం అత్యున్నతమైనది అని, రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజల హక్కుల రక్షణ కోసం ప్రతిపక్ష పార్టీగా మేం చేసే పోరాటానికి అందరూ కలిసి రావాలని భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పిలుపునిస్తున్నాము అని చంద్రబాబు స్పష్టం చేశారు.